తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లను ఖండించారు టీడీపీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లను ఖండించారు టీడీపీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ఆదివారం మాచవరం, తురకపాలెం గ్రామాల్లో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ.. తురకపాలెం, మోర్జంపాడు, జూలకల్లు, పిన్నెల్లి, తుమ్మలచెరువు తదితర గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. పోలీసులతో అన్యాయంగా కొట్టించారని ఆయన ఆరోపించారు.

వైసీపీ నాయకుల ఆగడాలకు, అరచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని.. తెలుగుదేశం హయాంలో పల్నాడు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించారని యరపతినేని గుర్తు చేశారు.

అన్యాయంగా కేసులు బనాయిస్తే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. ఒక గ్రామంలో పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగితే మిగిలిన గ్రామాల కార్యకర్తలందరూ ఏకమై వారికి అండగా నిలవాలని యరపతినేని సూచించారు.

నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా పనులు చేశామని.. పార్టీ ఓటమిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తాను తెలుగుదేశంలోనే పుట్టానని.. చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగుతానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని.. వారికి అండగా ఉంటానని యరపతినేని హామీ ఇచ్చారు.