Asianet News TeluguAsianet News Telugu

అందులో తెలంగాణ టాప్ 2... ఏపి మాత్రం లీస్ట్ 2: గణాంకాలతో సహా యనమల వెల్లడి

తెలంగాణలో గత వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతుంటే ఏపిలో మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయని... ఇందుకు వైసిపి పాలకులే కారణమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 

TDP Senior Leader Yanamala Ramakrishnudu shocking comments on AP CM YS Jagan
Author
Guntur, First Published Apr 30, 2020, 12:41 PM IST

అమరావతి: కరోనా కట్టడిపై జాతీయంగా, అంతర్జాతీయంగా తలలు పట్టుకుంటున్నారని... నియంత్రణపై ఏం చేయాలి, ఎలా చేయాలని జుట్టు పీక్కుంటున్నారని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మహమ్మారిని నయం చేసే వ్యాక్సిన్ పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తలమునకలుగా ఉన్నారని... జర్నలిస్ట్ లు, రచయితలు కథనాలు రాస్తూఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తున్నారని అన్నారు. అయితే సీఎం  జగన్ మాత్రం కరోనాను చిన్న జ్వరంగా, దీంతో ప్రమాదం లేదన్నట్లుగా చెప్పడం ఆత్మ వంచన, ప్రజలను వంచించడమేనని  యనమల మండిపడ్డారు. 

కరోనా జగన్ కు చుట్టంలా ఉన్నట్లుందని... చుట్టంలా ‘‘వస్తుంది...పోతుందని’’ అని అందువల్లే అని వుంటారని ఎద్దేవా చేశారు. ఆకరి రోమ్ లో నీరో చక్రవర్తి కొత్త నగరం కడదామని పాత నగరాన్ని తానే తగుల పెట్టాడని, ఆ మంటలను చూస్తూ ఫిడేలు వాయించాడానే ప్రచారం ఉందన్నారు. కరోనాతో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నా, అది చిన్న ఫ్లూ లాంటి దేనని సీఎం జగన్ చెప్పడం ఈ కోవలోదే... చిన్న జ్వరం లాంటిదని చెప్పడం జగన్ సైకాలజిని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. 

''కరోనా, లాక్ డౌన్ లతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, కుటుంబ స్థితిగతులు చిన్నాభిన్నం అవుతుంటే, వాటిని నిర్లక్ష్యం చేసి అదేదో చిన్నజ్వరంగా జమకట్టడం జగన్ సైకాలజికి దర్పణం.
 రాజకీయ లాభాల కోసం ప్రజల ప్రాణాలనే బలిపెట్టడం ఫ్యాక్షనిజానికి పరాకాష్ట. దేశంలో రోజుకు సగటున 1500 కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 80కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెప్పాయి. దేశంలో కరోనా ఎక్కువ ఉన్న 15జిల్లాలలో ఏపి జిల్లా(కర్నూలు) కూడా చేరింది. ఇవేమీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదా?''  అని ప్రశ్నించారు. 

''సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే మొదట్లో యంత్రాంగం తేలిగ్గా తీసుకుంది. ఇప్పుడీ దుస్థితికి స్వయంగా కారకుడు సీఎం జగన్. కరోనా కేసుల సంఖ్యలో దేశంలో 8వ స్థానంలో ఏపి ఉంది. కరోనా మరణాల్లో 6వ స్థానంలో ఉంది. తూర్పు తీర రాష్ట్రాలలో 2వ స్థానంలో ఉంది. కరోనా వృద్దిరేటులో దేశంలో 2వ స్థానంలో ఏపి ఉంది. డిశ్చార్జ్ డ్ కేసులలో అడుగునుంచి ఏపి 2వ స్థానంలో ఉంది'' అని  గణాంకాలు  వివరించారు. 

''కేసులు ఎక్కువ ఉన్నా తమిళనాడులో మరణాలు మనకన్నా తక్కువ. వారం రోజుల్లోనే ఏపి తెలంగాణను ఓవర్ టేక్ చేసింది. తమిళనాడును త్వరలోనే ఏపి ఓవర్ టేక్ చేసేలా ఉంది. కరోనాపై వాస్తవాలను వైసిపి నేతలు తొక్కేస్తున్నారు. ఎక్కువ టెస్టింగ్ లని డబ్బా కొడుతున్నారు. ఎక్కువ పరీక్షల వల్లే కేసులు ఎక్కువని చెప్పడం ఆత్మవంచన, రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. రికవరీలో మన రాష్ట్రం అట్టడుగున ఉంది'' అని విమర్శించారు. 

''దేశంలో బెస్ట్ రికవరీ స్టేట్స్ కేరళ 98.8%, హర్యానా 98.3%, తమిళనాడు 97.7% వుంటే ఏపి 4.7% మాత్రమే ఉంది. దక్షిణాదిన డిశ్చార్జ్ రేటులో తమిళనాడు 1,210తో తొలిస్థానంలో ఉంటే, తెలంగాణ 409తో 2వ స్థానం, కేరళ 369తో 3వ స్థానం, ఏపి 287తో అడుగునుంచి 2వ స్థానంలో ఉంది. కర్ణాటక 216తో చివరి స్థానంలో ఉంది. ఇందులోనే వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం బైటపడింది'' అని మండిపడ్డారు. 

''ఏదో చేస్తున్నట్లు ప్రకటనలే తప్ప ఆచరణలో సున్నా. కరోనా మరణాలను దాచిపెడుతున్నారు. మరణాలను దాచేస్తే కరోనా రాష్ట్రాన్నే కాల్చేస్తుంది. కరోనా కార్చిచ్చులో ప్రజలను బలి పెట్టకండి.  రోజురోజుకు కేసులు రెట్టింపు కావడం ఏపిలో పెరిగిపోతుంటే, కేరళ, తెలంగాణ, తమిళనాడులో తగ్గుతున్నట్లు అధ్యయనాలే పేర్కొన్నాయి. వైసిపి నాయకులే గుంపులుగా తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారనే దానికి ఈ అధ్యయనాలే ప్రత్యక్ష రుజువులు'' అని అన్నారు. 

''వైసిపి నిర్వాకాల వల్లే శ్రీకాళహస్తి, నరసరావు పేట వంటి చిన్న పట్టణాలు కూడా కరోనాతో విలవిల్లాడుతున్నాయి.  వైసిపి నేతల ట్రాక్టర్ల ర్యాలీలు, ప్రారంభోత్సవాల్లో జనం గుంపులతో పూలు జల్లించుకోడాలు, బహిరంగ సభలు పెట్టడాన్ని కేంద్రమంత్రులే తప్పు పట్టారు. కేరళలో రూ 20వేల కోట్ల ప్యాకేజి ప్రకటించారు. ఏపిలో పైసా ప్యాకేజి ప్రకటించలేదు. కరోనా కోసం కేంద్రం ఇచ్చిన నిధులు దారిమళ్లించారు. కాంట్రాక్టర్ల చెల్లింపులకే కరోనా కన్నా ప్రాధాన్యం. రోగ నివారణ కన్నా రంగులేయడంపైనే వైసిపి శ్రద్ద'' పెడుతోందని ఆరోపించారు. 

''వలస కూలీల బాధలు సీఎం జగన్ కు కనిపించవు. భవన కార్మికుల ఆకలి కేకలు వినిపించవు. రైతుల ఆవేదన ఆయనకు తెలియదు. ‘‘నేను ఉన్నాను, నేను విన్నాను’’ అని ఓట్లడిగింది ఇందుకేనా అని జనమే ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి'' అంటూ 
యనమల రామకృష్ణుడు సీఎం జగన్, వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios