Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై 120 మంది ఎమ్మల్యేల అసంతృప్తి.. గాల్లో వచ్చారు, గాల్లోనే కొట్టుకుపోతారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలనం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై 120 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గాల్లో వచ్చిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అదే గాల్లో కొట్టుకుపోతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

tdp senior leader gorantla butchaiah chowdary sensational comments on ap cm ys jagan
Author
First Published Dec 30, 2022, 4:57 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పై 120 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోకి రాలేని స్థితిలో సీఎం వున్నారని.. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతకాలం దాక్కుంటారంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించి స్థానిక సంస్థలను మోసం చేశారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. బటన్ నొక్కడం తప్పించి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని గోరంట్ల దుయ్యబ్టటారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించలేదని.. ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఆరు లక్షల మంది పింఛన్లను కట్ చేశారని.. గాల్లో వచ్చిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అదే గాల్లో కొట్టుకుపోతారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే.. సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లు, గుంతలు పూడ్చలేకపోతున్నామన్నారు. తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులిస్తోందని... అప్పుటు నీళ్లిస్తామని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. కేంద్రం నిధులిస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడగాలని ఆనం ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లేమైనా కట్టామా... పనులు మొదలుపెట్టామా అని ఆయన నిలదీశారు. పెన్షన్ ఇస్తే ఓట్లు వేస్తారా, గత ప్రభుత్వం కూడా పెన్షన్ ఇచ్చిందని, ఏమైందని ఆనం ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పానని, లే ఔట్లు వేశామే కానీ ఇళ్లు కట్టామా అని ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. 

ALso REad: బంధువులందరికీ సలహాదారు పోస్టులు.. కోట్లలో వేతనాలు , ఉద్యోగులకేవి జీతాలు : జగన్‌పై గోరంట్ల ఫైర్

కాగా.. అధికారులతో సమీక్ష సందర్భంగా వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ మోపూరులోని మొగిలిపాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాల వరకు పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల వైఖరి కారణంగానే ఇలా జరిగిందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పై నుంచి ఎంత వరద వస్తుందో తెలియదా అంటూ ఇరిగేషన్ అధికారులను కడిగిపారేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios