బంధువులందరికీ సలహాదారు పోస్టులు.. కోట్లలో వేతనాలు , ఉద్యోగులకేవి జీతాలు : జగన్పై గోరంట్ల ఫైర్
బంధువులకు కోట్లు ఇచ్చి సలహాదారులుగా నియమించుకుంటున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 20వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి జగన్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కార్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నా ఆపలేని స్ధితిలో జగన్ వున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పటి వరకు తీసుకురాలేకపోయారని గోరంట్ల మండిపడ్డారు. 20వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. పుట్టినరోజు వేడుకల కోసం ఎంతైనా ఖర్చు పెడతారని ... కానీ కళాకారులకు పెన్షన్ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం వద్ద డబ్బులు వుండవని బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. బంధువులకు కోట్లు ఇచ్చి సలహాదారులుగా నియమించుకుంటున్నారని.. జగన్ను సాగనంపడానికి జనం సిద్ధమయ్యారని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతున్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు.
ఇదిలావుండగా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మాదిరిగా తనకు వేరే రాష్ట్రం, వేరే పార్టీ లేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా తాను అనడం లేదని సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడే నివాసం ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా నది నీళ్లను కడప జిల్లాకు తీసుకు వచ్చారన్నారు. అంతకు ముందు ఎంతమంది సీఎంలున్నా కూడా జిల్లాకు కృష్ణా నది నీళ్లు తేలేదన్నారు.
Also REad: చంద్రబాబుకు విలువలు, నైతికత లేదు.. రాష్ట్రానికి పట్టిన కర్మ : స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు
వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే కడప జిల్లాలో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని ఆయన చెప్పారు. గతంలో ఎవరూ కూడా ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గాలేరు నగరిని తీసుకువచ్చేందుకు వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టు పూర్తైందన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జిల్లాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందని జగన్ చెప్పారు.
చిత్రావతి ప్రాజెక్టులో నీరు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చిత్రావతి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసినట్టుగా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ విషయాన్నిఅప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలోని నేతలు కూడా పట్టించుకోలేదని సీఎం జగన్ విమర్శించారు.కడపలో రూ. 8800 కోట్లతో స్టీల్ ప్యాక్టరీని నిర్మించనున్నట్టుగా సీఎం ప్రకటించారు.