టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్
పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనతోపాటు మరికొందరిపై దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే, చింతమనేని ప్రభాకర్ ని నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ ధరలను నిరసిస్తూ.. ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా చింతమనేని ప్రభాకర్ దెందులూరులో భారీ కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనతోపాటు మరికొందరిపై దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కాగా, చింతమనేని ప్రభాకర్ ఆదివారం విశాఖ జిల్లా జీకే వీధి మండలం దారాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి వెళ్తున్న సమయంలో స్థానిక పోలీసులు చింతమనేని ప్రభాకర్ని, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, తనను పొగిడిన ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరిస్తుంటే... తనను విమర్శిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించడం జగన్రెడ్డి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తా రు. ‘‘చింతమనేని పోలీసు విధులకు ఆటంకం కల్పించడం కాదు.. ప్రభుత్వమే శాంతియుత నిరసనలకు ఆటంకం కల్పించింది. చింతమనేనిని విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాం’’ అని అచ్చెన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు.