విశాఖలో రూ.50 వేల కోట్ల దోపిడి.. వాటా పంపకం దగ్గరే జగన్కు, విజయసాయిరెడ్డికి తేడాలు : బుద్దా వెంకన్న
ఉత్తరాంధ్రలో దోచుకున్న రూ.50 వేల కోట్ల వాటాల విషయంలోనే జగన్కు, విజయసాయిరెడ్డికి మధ్య తేడాలు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. విశాఖలో వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములన్నింటినీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే బాధితులకు అప్పగిస్తానని బుద్ధా వెంకన్న వెల్లడించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై మండిపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. గురువారం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో 50 వేల కోట్లకు పైగా దోచుకున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆ వాటాల విషయంలోనే జగన్కు , విజయసాయిరెడ్డికి మధ్య తేడాలు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్ 5 లక్షల కోట్లు దోచుకోవడానికి విశాఖకు వస్తానని అంటున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. తాను విశాఖకు వచ్చే వాళ్ల అవినీతిని బయటపెడతానని ఆయన హెచ్చరించారు. విశాఖలో వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములన్నింటినీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే బాధితులకు అప్పగిస్తానని బుద్ధా వెంకన్న వెల్లడించారు. జగన్ కరోనా వైరస్ అయితే.. చంద్రబాబు నాయుడు బోస్టర్ డోస్ అంటూ ఆయన అభివర్ణించారు.
అంతకుముందు కొద్దిరోజుల క్రితం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. వివేకా గుండెపోటు డ్రామాకు తెర పడిందన్నారు. అవినాష్ రెడ్డి హత్య చేపించాడని కేసులో నిందితులు సీబీఐకి చెప్పారని అన్నారు. ఈ హత్యలో జగన్ కు కూడా పాత్ర ఉందని వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యలో విజయసాయి రెడ్డినీ కూడా ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. గుండెపోటుతో చనిపోయాడని ఏవరు చెప్తే విజయసాయి రెడ్డి చెప్పారో విచారణ చేయాలన్నారు.
ALso Read: సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు
రెండో పెళ్లి వివాదంతోనే హత్య జరిగిందని మాట్లాడడం సిగ్గు చేటని వెంకన్న చురకలంటించారు. పైశాచికంగా హత్య చేసి టీడీపీపై నింద వేశారని.. వివేకా హత్య జరగకపోతే 2019లో జగన్ అధికారంలోకి వచ్చేవారు కాదని బుద్ధా వ్యాఖ్యానించారు. హత్యలో జగన్ పాత్ర లేకపోతే అవినాష్ రెడ్డినీ పార్టీ నుండి సస్పండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబం హత్యపై స్పందించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబానికి రక్షణ కల్పించాలని.. ప్రజలు ఓట్లు వేయకుంటే రాష్ట్రంపై అణుబాంబు వేసెంత ఘనులని ఆయన సెటైర్లు వేశారు.
ఇకపోతే.. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు చెప్పడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. వీలున్నప్పుడల్లా చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి.. ఇలా ట్వీట్ చేయడంతో వైసీపీ కేడర్ సైతం షాక్కు గురైంది.