తమ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి అరెస్టుపై టీడీపీ అధినేత నారా చం్దరబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇలా అరెస్టు చేసుకుంటూ పోతే ఎవరూ మిగలని జనగ్ రెడ్డి గుర్తించాలని ఆయన అన్నారు.

అమరావతి: సంగం డైరీని దెబ్బతీసి అమూల్ కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే దూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ధూళిపాళ్ల అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్ లు మాత్రం ఉంటున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. 

Also Read: టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర అరెస్టు, బాపట్లకు తరలింపు

తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

 ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలని ఆయన అన్నారు. దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై కేసులు నమోదు చేసి ధూళిపాళ్ల నరేంద్ర చౌదరిని గురువారం శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.