జైల్లో పెట్టిస్తారనేదే జగన్ భయం... కాబట్టే ఇలా...: ఎంపీ రామ్మోహన్ సీరియస్
తమ నాయకుడు జగన్ పై వున్న కేసులవల్లే వైసిపి ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నారని టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.
తిరుపతి: ఎక్కడ తమ నాయకుడు వైఎస్ జగన్ ను జైల్లో పెట్టిస్తారోనన్న భయంతో వైసిపి ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడలేకపోతున్నారని... రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నారని టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై వైసిపి ఎంపీలు పార్లమెంట్లో ఏనాడైన గట్టిగా మాట్లాడారా? అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. కేవలం కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్ ఆలోచన అని విమర్శించారు.
తిరుపతిలో రామ్మోహన్ మాట్లాడుతూ... వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా? అని నిలదీశారు. తిరుపతిలో ఏదయినా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు హయాంలోనేనని పేర్కొన్నారు. కాబట్టి టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మిని ఉపఎన్నికల్లో గెలిపించాలని రామ్మోహన్ నాయుడు తిరుపతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
read more మనిషిని దేవుడితో పోల్చడం సరైందికాదు: రమణ దీక్షితులు వ్యాఖ్యలకు బాబు కౌంటర్
ఇక ఇప్పటికే ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిన బీజేపీకి వత్తాసు పలుకుతున్న వైసీపీకి తిరుపతి పార్లమెంట్ ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలన్నారు తిరుపతి లోక్సభ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి. 21 మంది వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఏరోజైనా రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నించారా? అని పనబాక నిలదీశారు.
తిరుపతి ప్రచారంలో ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారని ఆమె చెప్పారు. గరుడవారధి, గూడూరు ఫ్లైఓవర్, నడికుడి రైల్వేలైన్ ఇలా ఏ ప్రాజెక్టు చూసినా అసంపూర్తిగానే ఉన్నాయని లక్ష్మీ మండిపడ్డారు. నాలుగు సార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా పని చేసిన తనకు మరో అవకాశం కల్పించాలని పనబాక లక్ష్మీ ఓటర్లను కోరారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే తిరుపతి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తానని పనబాక విజ్ఞప్తి చేశారు. కాగా, ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. మే 2న ఓట్లను లెక్కించనున్నారు.