గోబెల్స్ మించారు: వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్
అవాస్తవాలను ప్రచారం చేయడంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర,హోంమంత్రి సుచరిత గోబెల్స్ ను మించిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.
విజయవాడ: అవాస్తవాలను ప్రచారం చేయడంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర,హోంమంత్రి సుచరిత గోబెల్స్ ను మించిపోయారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.
గతంలో చంద్రబాబు సర్కార్ ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టుగా ఆధారాలతో సహా నిరూపించామని అంటున్నారు. మరి ఆ ఆధారాలు ఎక్కడ, మీ పత్రికలో ఎందుకు పత్రికలో ప్రచురించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే అంశంపై కోర్టులో కేసు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆధారాలు చూపించలేక చేతులెత్తేసి కేసు విత్ డ్రా చేసుకున్నారని ఆయన విమర్శించారు.
మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమైతే హోంమంత్రి ఏడాదిన్నర లో ఏం చర్యలు తీసుకున్నట్టు అని ఆయన ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో లబ్ది కోసం కేసులు వేశారా అని ఆయన అడిగారు.
ఎన్నికల తరువాత ఇదే అంశంపై వైవి సుబ్బారెడ్డి వేసిన కేసు కూడా వెనక్కి తీసుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇజ్రాయిల్ టెక్నాలజితో ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసులు వేసి ఎందుకు వెనక్కి తగ్గారో సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి ,వైవి సుబ్బారెడ్డి గారిని హోంమంత్రి ప్రశ్నించాలని ఆయన కోరారు.