అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డిని తాలిబన్ తో పోలుస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రని చెరబట్టిన తాలిబన్ విజయసాయి అని వెంకన్న మండిపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''ఉత్తరాంధ్రలో ఎవరైనా భూ ఆక్రమణకు పాల్పడితే తనకు ఫిర్యాదు చేయాలని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. ఆయనే భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు కాబట్టి ఆయనపై ఆయనకే ఫిర్యాదులు చేయాలా?'' అని వెంకన్న ప్రశ్నించారు. 

''రూ.42 వేల కోట్లను ఈడీ జప్తు చేసిన కేసుల్లో దొంగ లెక్కలు రాసింది ఆడిటర్ విజయసాయిరెడ్డి అని అందరికీ తెలుసు. ఇతర ప్రాంతాల నుండి గూండాలను తెచ్చి ఉత్తరాంధ్రలో ఉంచి వారిని పెంచి పోషిస్తున్న వ్యక్తి విజయసాయి. ఉత్తరాంధ్రకు వలస వచ్చిన బందిపోటు విజయసాయి'' అని మండిపడ్డారు. 

''సర్పంచు నుంచి ముఖ్యమంత్రి దాక జరిగిన అవినీతి, అక్రమాల గురించి తన పత్రికల్లో ఎక్కడా ఒక్క ముక్క రాయలేదు. వైసీపీ మోసాలు, దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవి పచ్చ మీడియా, తీసుకెళ్లనివి మంచి మీడియానా?'' అని అడిగారు. 

read more ఆ పోలీస్ అధికారులపై యాక్షన్ తీసుకోండి: హెచ్చార్సీకి వర్ల రామయ్య లేఖ

''చంద్రబాబు నాయుడంటే ప్రాణాలిచ్చేవారు రాష్ట్రంలో అనేకమంది ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్ లను తిడితే జగన్ వద్ద మార్కులు పడతాయని, మంత్రి పదవుల కాల పరిమితి పెరుగుతుందని తిట్టడం ఇదంతా వృధా ప్రాయాస. ఈ పద్ధతిని మానుకోవాలన్నారు'' అని సూచించారు. 

''13 కేసుల్లో ముద్దాయిగా ఉండి, రూ.43 వేల కోట్ల ఈడీ కేసుల్లో ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి నీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విజయసాయిని ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించి మానసిక చికిత్స చేయించాల్సిన అవసరముంది'' అని అన్నారు. 

''అధికారంలోకి వచ్చిననాటి నుండి వైసీపీ చేసిన అవినీతి దందాలపై విశాఖ జగదాంబ సెంటర్లో చర్చకు నేను సిద్దం... నా సవాల్ ను స్వీకరించే దమ్ముందా విజయసాయి రెడ్డి? మీడియా ముందు అవాకులు, చవాకులు పేలడం మాని నా సవాల్ ను స్వీకరించు. మేం అధికారంలోకి వచ్చాక విజయసాయి రెడ్డితో తిన్నదంతా కక్కిస్తాం'' అని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.