Asianet News TeluguAsianet News Telugu

నాపై సిబిసిఐడి కేసుల వెనక పీఆర్సి స్ట్రగుల్ కమిటీ నేత..: టిడిపి ఎమ్మెల్యే అశోక్ బాబు

తన సర్వీస్ రికార్డులో విద్యార్హతలను తప్పుగా పేర్కొన్నాడంటూ నమోదయిన ఫోర్జరీ కేసుపై టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. సిబి సిఐడి కాదు సిబిఐ విచారణకు కూడా తాను భయపడబోనన్నారు. 

tdp mlc ashok babu reacts on cb cid cases
Author
Amaravati, First Published Jan 26, 2022, 4:42 PM IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్సీ అశోక్ బాబు‌ (ashok babu) సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఏపీ సీబీ సీఐడీ (CB CID) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తన సర్వీస్ రికార్డులో విద్యార్హతలను తప్పుగా పేర్కొన్నందుకు ఆయనపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఆయనపై 477A,465 (ఫోర్జరీ), 420 (చీటింగ్) సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు. 

ఈ క్రమంలోనే తనపై నమోదయిన కేసుపై అశోక్ బాబు స్పందించారు. డిగ్రీ సర్టిఫికెట్ ఫోర్జరీ వ్యవహారంలో తనపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేసినట్లు మీడియా ద్వారా తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై తన శ్రేయోభిలాషుల అనుమానాలు నివృత్తి కోసమే ఈ కేసుల వ్యవహారంపై స్పందిస్తున్నట్లు అశోక్ బాబు పేర్కొన్నారు. 

''ఇది చాలా పాత సబ్జెక్ట్. టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల ఇది జరిగింది. దీనిని నేరంగా పరిగణించి గతంలో నా ప్రత్యర్థులు వివాదం చేశారు. దాని ఫలితమే ఇవాళ నాపైన కేసు. నేను సర్వీసులో ఉండగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్లని హెడ్ ఆఫీసుకు డిప్యుటేషన్ పై పిలిచారు. నా క్వాలిఫికేషన్ డిప్లమో ఇన్ కంప్యూటర్స్ అని నేను స్పష్టంగా చెప్పాను. డి.కామ్ ను బి.కామ్ గా టైప్ అవ్వడం వల్ల నేను తప్పుడు సమాచారం ఇచ్చానని నా ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిగింది. 2019లోనే దానిని క్లోజ్ చేశారు. ఇందులో ఎలాంటి నేరపూరితం లేదని, ఎలాంటి బెనిఫిట్స్ పొందలేదని, పనిష్ మెంట్ సరికాదని విచారణ అధికారి కూడా తేల్చారు.. నాపైన ఉన్న ఛార్జస్ అన్నీ డ్రాప్ అయి మూడేళ్లు దాటింది'' అని అశోక్ బాబు తెలిపారు. 

''అయితే నేను టీడీపీలో ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక అసూయతో నా డిపార్ట్ మెంట్ లో పనిచేసిన వారు చేసిన పనే ఇది. బి.మెహర్ కుమార్ అనే ఉద్యోగితో లోకాయుక్తలో పిటిషన్ పెట్టించారు. రాజకీయ కారణాలు కూడా ఈ ఫిర్యాదుకు కారణం. పీఆర్సీ స్ట్రగుల్ కమిటీలో సూర్యనారాయణ అనే వ్యక్తి ప్రోద్బలంతోనే ఇది జరిగింది. మాకు వ్యతిరేకంగా అతను ఉండేవాడు. ఎన్జీవో ఆర్గనైజేషన్ లో కూడా నాపై పోటీకి వచ్చి ఓడిపోయాడు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని రకాలు ప్రయత్నించినా ఏదీ సక్సెస్ కాలేదు. ఇది కూడా సక్సెస్ కాదు'' అన్నారు.

''లోకాయుక్త నుంచి సీబీసీఐడీకి విచారణకు రావడం అనేది ఎంతవరకు చట్టబద్ధత ఉందనేది చూడాలి. నేను చేయని పని ఇది. టైపో గ్రాఫిక్ మిస్టేక్. ప్రభుత్వం కూడా ఆనాడు డ్రాప్ అయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు వచ్చాయి. ఇది ఇష్టం లేని వారు కోర్టుకు వెళ్లి విఫలమయ్యారు. రాజకీయంగా దెబ్బతీయడానికి మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడు దీనిని తెరపైకి తీసుకురావడంలోనే రాజకీయం ఉంది'' అని ఆరోపించారు.

''ప్రభుత్వ సొంత మనిషి సూర్యనారాయణ. ఆయన వెనుక ఎలాంటి ఆర్గనైజేషన్ లేదు. టీడీపీని వ్యతిరేకించాడు కాబట్టి ప్రభుత్వం సూర్యనారాయణను దగ్గరకు తీసింది. జీరోను హీరోను చేశారు. రిటైరై మూడేళ్ల తర్వాత నాపై సీబీసీఐడీ కేసు పెట్టడం రాజకీయంగా వెంటపడాలనే ఉద్దేశమే ఉంది. సీబీఐ ఎంక్వైరీ వేసినా నా తప్పు లేదు అనే నమ్మకం ఉంది. నేను భయపడాల్సిన పనిలేదు. రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేయడం ప్రభుత్వం చేతగానితనమే.  దీనిపై చట్టపరంగా నేను పోరాడతాను'' అని అశోక్ బాబు తెలిపారు.

''చాలా మంది ఉద్యోగుల్లో దీనిపై అవగాహన ఉంది. ప్రజలకు తెలియదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి చెడ్డపేరు రాకూడదని.. వాస్తవాలు బహిర్గతం చేస్తున్నాను. ఆ రోజు జరిగిన చిన్న పొరపాటుకి అన్ని విచారణలు పూర్తై క్లీన్ చిట్ ఇచ్చారు. నేను తప్పు చేసి ఉంటే.. సీబీసీఐడీ లెవల్ లో ఉంటే.. దీనిపై లీగల్ గా పోరాడతాం. కానీ ప్రభుత్వం ఇంత కంటే.. ఎన్నో కేసులు సోషల్ మీడియాలో వచ్చిన వాటిపై టీడీపీ ఫిర్యాదు చేస్తే సీబీసీఐడీకి అప్పగించారు. రెండేళ్లైనా వాటిల్లో ఇంతవరకు పురోగతి లేదు. నా కేసు మాత్రం స్పీడ్ గా నిర్ణయం తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టారని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల్లో పనిచేసినందుకు ఇలాంటి కక్షసాధింపు చర్యలు చేయడం మంచిది కాదు'' అని అశోక్ బాబు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios