టీడీపీ నేతలపై నిఘా పెట్టింది వాస్తవం కాదా.. ఆడిట్కు సిద్ధమా : వైసీపీ ప్రభుత్వానికి పయ్యావుల సవాల్
టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టిందని.. దీనిపై ఆడిట్ కు సిద్ధమా అని సవాల్ విసిరారు పయ్యావుల కేశవ్. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ ట్యాప్ లను తాము వాడటం లేదని ఆయన తెలిపారు.
పెగాసస్ సాఫ్ట్వేర్ కి (pegasus spyware) సంబంధించి అధికార వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు టీడీపీ నేత (tdp) , పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు (chandrababu naidu) ప్రభుత్వం పెగాసెస్ ఎక్విప్మెంట్ కొన్నారని అనవసపు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసెస్ ఎక్విప్మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్టీఏ ద్వారా సమాధానం ఇచ్చారని పయ్యావుల గుర్తుచేశారు. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేశవ్ దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు డేటా చౌర్యం చేశారని గతంలో అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారని పయ్యావుల ఆరోపించారు.
పెగాసెస్ పై పెద్ద సభా కమిటిని వేసి చర్చ నిర్వహించడం వృధాప్రయాసే అయ్యిందని.. పెగాసెస్ మీద చర్చ జరగాలని శాసనసభలో వేస్ట్ గా షార్ట్ డిస్కసన్ కూడా పెట్టారని ఆయన మండిపడ్డారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమని కేశవ్ ధ్వజమెత్తారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఇచ్చిన ల్యాప్ ట్యాప్ లు ఏ ఎమ్మెల్యే వాడటం లేదన్నారు. సమాజానికి హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘా టీడీపీ నాయకులపై నిరర్థకంగా కొనసాగిస్తున్నారని కేశవ్ దుయ్యబట్టారు.
రాజకీయ నేతలు, సొంత పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా నిఘా పెట్టడం నిజంకాదా అని పయ్యావుల ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్ కు సిద్ధమా అని కేశవ్ సవాల్ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యేలచే ఆరోపణలు చేయించడంకాదు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా అని పయ్యావుల నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీకి సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.