ఫలించిన చంద్రబాబు వ్యూహం.. మనసు మార్చుకున్న గోరంట్ల, రాజీనామా నిర్ణయం వెనక్కి
టీడీపీకి రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీలో నెలకొన్ని కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ ముగిసింది. 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించిన అనంతరం గోరంట్ల గౌరవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ... టీడీపీకి రాజీనామా నిర్ణయాన్ని ఉప సంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీలో నెలకొన్ని కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
అయితే ఎంతో మంది మిత్రలు, అభిమానులు తనను రాజీనామా చేయొద్దని కోరారని గోరంట్ల తెలిపారు. పార్టీకి సంబంధించి తన అభిప్రాయాలను చంద్రబాబుకు స్పష్టంగా చెప్పానని.. కార్యకర్తల మనోభావాలను అధినేతకు వివరించానని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగాలని.. అలాగే లోటుపాట్లు ఏమైనా ఉంటే చర్చించుకుంటాం.. సరిదిద్దుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని గోరంట్ల చెప్పారు.
ALso Read:బుచ్చయ్య చౌదరికి టీడీపీ బుజ్జగింపులు: గోరంట్లతో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని.. ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమబాటలోకి తీసుకెళ్లాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. నలబై ఏళ్లుగా పార్టీలో ఉన్నానని..ఉన్నంత కాలం పార్టీకి సేవ చేస్తానని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవరీనీ బెదిరించడానికో, పదవుల కోసమో తాను అసంతృప్తి వ్యక్తం చేయలేదని.. పార్టీ కోసమే తన తపనంతా అని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. గోరంట్ల వెంట పార్టీ నేతలు చిన రాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్, జవహర్ తదితరులు ఉన్నారు.