మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు.. స్థలాన్ని పరిశీలించిన నేతలు
మే 27 , 28 తేదీల్లో రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు జరగనుంది. మహానాడు జరిగే ప్రాంతంలో భూమిని చదును చేయడం, వేదిక నిర్మాణం తదితర పనులను టీడీపీ నేతలు పరిశీలించారు.
![tdp mahanadu held on may 27 and 28 tdp mahanadu held on may 27 and 28](https://static-ai.asianetnews.com/images/01evvd6d0qms65zgpsws8qde2m/flag-jpg_363x203xt.jpg)
మే 27 , 28 తేదీల్లో రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమం జరగనున్న స్థలాన్ని ఆదివారం టీడీపీ బృందం పరిశీలించింది. రాజమండి నగరానికి సమీపంలోని వేమగిరిలో స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. మహానాడు కోసం 15 కమిటీలు వేశామన్నారు. ఈ సారి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, అదే సమయంలో మహానాడు కూడా నిర్వహించడం శుభపరిణామమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మహానాడు జరిగే ప్రాంతంలో భూమిని చదును చేయడం, వేదిక నిర్మాణం తదితర పనులను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ఏపీలోని సమస్యల పరిష్కారం దిశగా మహానాడు వుండబోతోందని.. 1994లోనూ రాజమండ్రిలో మహానాడు నిర్వహించిన తర్వాత తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని యనమల గుర్తుచేశారు. 175కి 175 సీట్లు గెలిచే దిశగా ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు.