పాలకొల్లు రాజకీయం: బాబ్జీకి గాలం వేస్తున్న చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తిని (బాబ్జీ) పార్టీలో చేరాలంటూ టీడీపీ నేతలు ఆహ్వానించారు
పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తిని (బాబ్జీ) పార్టీలో చేరాలంటూ టీడీపీ నేతలు ఆహ్వానించారు. ఈ విషయమై ఆలోచించి నిర్ణయం తీసుకొంటానని డాక్టర్ బాబ్జీ ప్రకటించారు.
పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ బాబ్జీని తమ వైపుకు లాగేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగానే టీడీపీ కూడ ఈ మేరకు తన వంతు ప్రయత్నాలను మొదలు పెట్టింది. పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గాంధీ భగవాన్ రాజు, మున్సిఫల్ ఛైర్మెన్ వల్లభు నారాయణమూర్తి, కొందరు కౌన్సిలర్లు డాక్టర్ బాబ్జీని కలిశారు.
టీడీపీలో చేరాల్సిందిగా బాబ్జీని ఆ పార్టీ నేతలు కోరారు. తనకు టీడీపీ అంటే అభిమానమేనని బాబ్జీ ఆ పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం. అయితే ఈ విషయమై తాను ఆలోచించి నిర్ణయాన్ని వెల్లడిస్తానని బాబ్జీ టీడీపీ నేతలకు చెప్పారు.
బాబ్జీని ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ పార్టీల నేతలు బాబ్జీతో మంతనాలు జరుపుతున్నారు. వైసీపీ, జనసేన నేతలు కూడ బాబ్జీతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇటీవలనే జనసేనలో చేరిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడ డాక్టర్ బాబ్జీతో చర్చలు జరిపినట్టు సమాచారం. జనసేనలో చేరాలని డాక్టర్ బాబ్జీని సత్యనారాయణ ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతోంది.
పార్టీలో చేరాలని కూడ డాక్టర్ బాబ్జీకి సీఎం పేషీ నుండి ఆహ్వానాలు అందాయని కూడ చెబుతున్నారు. నీతికి, నిజాయితీకి డాక్టర్ బాబ్జీ కట్టుబడి ఉంటారని పేరుంది.ఈ కారణంగానే అన్ని పార్టీలు ఆయనకు ఆహ్వానాలు అందిస్తున్నాయి.
డాక్టర్ బాబ్జీ స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్గా కొనసాగుతున్నారు. జనసేన, వైసీపీ, టీడీపీ నేతలు డాక్టర్ బాబ్జీకి గాలం వేస్తున్నారని తెలిసి బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.