ఫ్యాక్షనిస్ట్ నోట.. సోషలిస్ట్ మాట, ఎక్కడ చూసినా రెడ్ల హవాయే : జగన్పై యనమల ఆగ్రహం
జగన్ మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు ఇక్కట్లు తప్ప ఏం జరిగిందన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. చివరికి నామినేటెడ్ పదవుల్లోనూ టీడీపీ బీసీలకు పెద్ద పీట వేస్తే.. ఇప్పుడు మొత్తం రెడ్లే కనిపిస్తున్నారని యనమల దుయ్యబట్టారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పాలనలో బీసీలను అణచివేయడమేనని విమర్శించారు. బీసీలను బలి తీసుకుంటున్న విజయసాయరెడ్డి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఏంటని యనమల ప్రశ్నించారు. రాష్ట్రంలోని కీలక పదవుల్లో తెలుగుదేశం పార్టీ బీసీలను నియమించిందని ఆయన గుర్తుచేశారు. కానీ మూడున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీలకు ఇక్కట్లు తప్ప మరేమీ లేవని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. చివరికి నామినేటెడ్ పదవుల్లోనూ టీడీపీ బీసీలకు పెద్ద పీట వేస్తే.. ఇప్పుడు మొత్తం రెడ్లే కనిపిస్తున్నారని యనమల దుయ్యబట్టారు.
ఆవిర్భావం నుంచి బీసీలంతా టీడీపీకి అండగా నిలిచారని.. అందుకే వారిపై వైసీపీ ప్రభుత్వం దాడులకు దిగుతోందని రామకృష్ణుడు ఆరోపించారు. రిజర్వేషన్లను కుట్రపూరితంగా కుదించారని ఆయన దుయ్యబట్టారు. జగన్ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరని.. అలాంటి వ్యక్తి సోషలిస్ట్గా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి మోసాలు, దుర్మార్గాలకు త్వరలోనే శుభం కార్డు వేసి.. నియంతృత్వాన్ని సమాధి కట్టడం తథ్యమని యనమల జోస్యం చెప్పారు.
ALso REad:ఆస్తులను దోచుకునేందుకు... పరిపాలనా రాజధాని ముసుగు : జగన్పై యనమల వ్యాఖ్యలు
అంతకుముందు బుధవారం యనమల మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కోరుకోవడం లేదని... వారికి కావాల్సిన అభివృద్ధిని జగన్ రెడ్డి చేయడం లేదని యనమల ఎద్దేవా చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తోన్న స్పందనను చూసి తట్టుకోలేక... దీనిని అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని రామకృష్ణుడు ఆరోపించారు. రైతులపై దాడులు చేయించడంతో పాటు నానా మాటలు అన్నారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి అంటే జగన్కు ఎందుకంత కక్ష అని యనమల ప్రశ్నించారు.
మూడు రాజధానుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ ఎమ్మెల్యేలకు లేదని.. హైకోర్ట్ పరిధిలో విషయం వున్నప్పుడు మూడు రాజధానుల గురించి ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని యనమల దుయ్యబట్టారు. వైసీపీ చేసిన ఈ చర్య కోర్టు ధిక్కారమేనని రామకృష్ణుడు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా గెలుపొందడం కోసమే వైసీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. పరిపాలనా రాజధాని ముసుగులో ఉత్తరాంధ్ర భూములను ఆస్తులను దోచుకుంటున్నారని... ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని యనమల డిమాండ్ చేశారు.