మంత్రులు, ఎంపీల స్వగ్రామాల్లోనూ వైసిపి బలపర్చిన అభ్యర్ధులు ఓటమి పాలవ్వడం జగన్ రెడ్డి పాలనపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య.
గుంటూరు: రెండో విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు వైసీపీ అరాచకాలకు చెంపపెట్టని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంత్రులు, ఎంపీల స్వగ్రామాల్లోనూ వైసిపి బలపర్చిన అభ్యర్ధులు ఓటమి పాలవ్వడం జగన్ రెడ్డి పాలనపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.
బూతుల మంత్రి కొడాలి నాని వాడిన భాష, అసభ్య పదజాలం ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు జీర్ణించుకోలేకోయారు. అందువల్లే ఈ ప్రభుత్వానికే బుద్ధి చెప్పాలన్న ఆలోచన రాష్ట్ర ప్రజల్లో వచ్చిందన్నారు. ప్రజలు 5ఏళ్లు అధికారం ఇస్తే రెండేళ్లకే అయ్యగారి భాగోతం బయటపడిందన్నారు.
''గ్రామాల్లో ఈ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారు. బూతుల మంత్రి స్వగ్రామంలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామం, నగరి వంటి అనేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సొంత గ్రామాల్లో ఓటమిపాలయ్యారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం మాకొద్దని ప్రజలు అంటున్నారు. ఈ దొంగల ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారు'' అన్నారు.
read more పంచాయతీలో షాక్: కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ మద్దతుదారు విజయం
''వైసిపి ప్రభుత్వ డొల్లతనం ఇక చెల్లదు. ప్రజల్లో ఎప్పుడైతే గణనీయమైన మార్పు వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ప్రజలు వచ్చే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బుద్ధి చెబుతారు'' అని రామయ్య హెచ్చరించారు.
రెండో విడత పంచాయితీ ఎన్నికలపై టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందిస్తూ...ప్రభుత్వం మీద ప్రజల అసంతృప్తి ప్రారంభమైందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. మొదటి దశలో పోలీసులు, అధికారులు కలిసి దౌర్జన్యం సృష్టించారని... అయినా టీడీపీ కార్యకర్తలు, నాయకులు గట్టిగా పోరాడి విజయం సాధించారన్నారు. ఏకగ్రీవాలకు తాము వ్యతిరేకం కాదు... కానీ బలవంతపు ఏకగ్రీవాలను తప్పు పడుతున్నామన్నారు. పుంగనూరు, మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయన్నారు. అధికార మదంతో వైసీపీ చేసిన అరాచకాలకు ప్రజలు తిరగబడ్డారన్న సంకేతమే ఈ ఫలితాలన్నారు అశోక్ బాబు.
