Asianet News TeluguAsianet News Telugu

‘రాజకీయాల నుంచి తప్పుకోకుంటే.. నిన్ను తొందరలో చంపేస్తాం’: టీడీపీ నేతకు బెదిరింపులు..

వైస్సార్ జిల్లాలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ‌ను గుర్తుతెలియని వ్యక్తులు పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు. కమలాపురంలో రామపురం గుడి వద్ద నిలిపి ఉన్న ఆయన కారును ధ్వంసం చేయడంతో పాటుగా కారుకు పేపర్లను అంటించి వెళ్లారు. 

tdp leader sainath sharma threatened by unidentified persons in kamalapuram
Author
Kadapa, First Published May 17, 2022, 11:13 AM IST

వైస్సార్ జిల్లాలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ‌ను గుర్తుతెలియని వ్యక్తులు పరోక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు. కమలాపురంలో రామపురం గుడి వద్ద నిలిపి ఉన్న ఆయన కారును ధ్వంసం చేయడంతో పాటుగా కారుకు పేపర్లను అంటించి వెళ్లారు. అందులో ‘‘నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోకుంటే.. లేదంటే నీ కారుకు పట్టిన గతే నీకు పడుతుంది’’, ‘‘మేమంటే లెక్క లేదా చంపేస్తాం నిన్ను తొందరలో’’ అని పేపర్లలో రాసి ఉంది.  మరోవైపు సాయినాథ్ ఇంటి వద్ద కూడా దుండగులు పేపర్లు అంటించారు. అందులో.. ‘‘ఓరేయ్ సాయి చావుకు సిద్దంగా ఉండు’’ అని రాసి ఉంది. అర్ధరాత్రి సమయంలో దుండగులు ఈ పనిచేసి ఉంటారని సాయినాథ్ శర్మ భావిస్తున్నారు.

ఇక, ఈ ఘటనకు సంబంధించి సాయినాథ్ శర్మ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ పని ఎవరైనా ఆకతాయిలు చేశారా..? లేక ఎవరైనా కావాలనే చేశారా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగాం రేపు కమలాపురంలో పర్యటించనున్నారు. ఈ సమయంలో టీడీపీ నేతకు ఇలాంటి బెదిరింపులు ఎదురుకావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

ఇక, కడప పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) ఉదయం 10.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. మొదట ఉమ్మడి కడప జిల్లా నియోజకవర్గాల సమావేశంలో పాల్గొంటారన్నారు. తర్వాత ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి చెన్నూరు, ఖాజీపేట మీదుగా కమలాపురానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు అక్కడ బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios