‘‘గుడివాడ సైకో పోవాలి.. సైకిల్ రావాలి’’.. కొడాలి నాని పీడ పోవాలంటూ టీడీపీ నేతల పూజలు
గుడివాడ నియోజకవర్గానికి కొడాలి నాని పీడపోవాలంటూ టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడివాడకు పట్టిన కొడాలి నాని అనే శనిని అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయని రావి వెంకటేశ్వరరావు జోస్యం చెప్పారు.
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీరుపట్ల .. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ‘‘గుడివాడ సైకో పోవాలి.. సైకిల్ రావాలి’’ అంటూ ఆయన కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. గుడివాడకు పట్టిన కొడాలి నాని అనే శనిని అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయని రావి వెంకటేశ్వరరావు జోస్యం చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలగలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు కొడాలి నాని పీడ విరగడవ్వాలంటూ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి.
ఇకపోతే.. గత నెలలో రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి తానే పోటీ చేస్తానని చెప్పారు. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు. కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకోనేందుకు వైసీపీ ప్రయత్నించిందన్నారు. తనకు వైసీపీ కార్యకర్తలు ఫోన్లు చేసి బెదిరించారన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని కూడా వెంకటేశ్వరరావు ఆరోపించారు.
ALso REad: వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి నేనే పోటీ చేస్తా: రావి వెంకటేశ్వరరావు
వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్ధి గుడివాడ నుండి పోటీ చేస్తాడని కొడాలి నాని అనుకుంటున్నారన్నారు. కానీ తానే గుడివాడ నుండి పోటీ చేస్తానని రావి వెంకటేశ్వరరావు చెప్పారు. తన గెలుపు కోసం కొందరు ఎన్ఆర్ఐలు పనిచేస్తారని రావి వెంకటేశ్వరరావు చెప్పారు. తమ పార్టీలో సంగతి నీకేందుకని కొడాలి నానిని ప్రశ్నించారు . వంగవీటిరంగా హత్య తర్వాత టీడీపీ ఓటమి పాలైందని.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయాన్ని రావి గుర్తు చేశారు.
ఇదిలావుండగా.. 2019 ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి దేవినేని అవినాష్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2009, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ, పీఆర్పీల నుంచి రావి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1983, 1985 ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి నందమూరి తారకరామారావు పోటీ చేసి విజయం సాధించారు. 1989లో కటారి ఈశ్వర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.1994లో గుడివాడ నుండి రావి శోభనాద్రీచౌదరి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 1999లో రావి హరిగోపాల్ టీడీపీ నుండి పోటీ చేసి గెలుపొందారు . 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004 నుండి గుడివాడ కొడాలి నాని అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో నానిని ఈ స్థానంలో ఓడించాలని టీడీపీ నాయకత్వం పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే.