చంద్రబాబు, లోకేశ్లు అక్కర్లేదు.. దమ్ముంటే నాపై గెలువు : కొడాలి నానికి రావి వెంకటేశ్వరరావు సవాల్
వచ్చే ఎన్నికల్లో గుడివాడలో దమ్ముంటే తనపై గెలవాలని మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. అవినీతి సంపాదనను ఎంత విచ్చలవిడిగా విరజిమ్మినా వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలవలేరన్నారు.
నిత్యం తెలుగుదేశం పార్టీ , చంద్రబాబు నాయుడు , నారా లోకేష్లపై విరుచుకుపడే మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నానికి సవాల్ విసిరారు టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నానిపై పోటీకి చంద్రబాబు, లోకేశ్ వంటి పెద్ద లీడర్లు అక్కర్లేదన్నారు. దమ్ముంటే తనపై గెలిచి చూపించాలని కొడాలి నానికి రావి వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. కొడాలి నానికి ఇటీవల కిడ్నీ ఆపరేషన్తో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా అయ్యిందేమోనంటూ ఆయన సెటైర్లు వేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నందుకు తొందరపడి ఇలాంటి నేతలను ఎన్నుకోవడం తమ ఖర్మ అనుకుంటున్నారని రావి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఆయన జోస్యం చెప్పారు. అవినీతి సంపాదనను ఎంత విచ్చలవిడిగా విరజిమ్మినా వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలవలేరన్నారు.
ALso REad:2024 తర్వాత చంద్రబాబును టీడీపీ నుంచి తరమడానికి ఎన్టీఆర్ వారసులు సిద్దంగా ఉన్నారు: కొడాలి నాని
కాగా.. నిన్న కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ... గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ వచ్చి పోటీ చేసినా వైసీపీ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని చెప్పారు. కుల సంఘాలు వచ్చినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిన గుడివాడలో గెలుపు తనదేనని అన్నారు. టీడీపీ పోటీలను ప్రజలు మరిచిపోలేదని అన్నారు. సీఎం జగన్ను బూతులు తిట్టేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏమి లేదని అన్నారు. చంద్రబాబుకే కాదు.. టీడీపీకి కూడా ఇదే చివరి ఎన్నికలు అని విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్లను టీడీపీ నుంచి తరమడానికి ఎన్టీఆర్ వారసులు సిద్దంగా ఉన్నారని కామెంట్స్ చేశారు. తర్వాత ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబు, లోకేష్లు అనుకుంటారని ఎద్దేవా చేశారు.