గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ, నేత  పట్టాభిని  పోలీసులు  ఇవాళ జడ్జి ముందు ప్రవేశపెట్టారు.

గన్నవరం: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు బుధవారం నాడు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హజరుపర్చారు.ఈ నెల 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ , వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ విషయమై పట్టాభి సహ 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్తున్న పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గన్నవరంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్పీ జాషువా మంగళవారం నాడు ప్రకటించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గన్నవరం ఘటన నేపథ్యంలో పట్టాభి సహ 15 మందిని నిన్న గన్నవరం కోర్టులో పోలీసులు హజరుపర్చారు. అయితే తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదుపై పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో మంగళవారంనాడు గుంటూరు జీజీహెచ్ లో పట్టాభికి పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల రిపోర్టును గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జికి అందించనున్నారు పోలీసులు.

గుంటూరు ఆసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తిరిగి కోర్టుకు పోలీసులు వచ్చారు. అయితే అప్పటికే కోర్టు సమయం ముగిసింది. దీంతో గన్నవరం పోలీస్ స్టేషన్ లోనే మంగళవారంనాడు రాత్రి పట్టాభిని ఉంచారు పోలీసులు.

also read:చీకటి గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతూ... నాపై పోలీసుల థర్డ్ డిగ్రీ : టిడిపి నేత పట్టాభిరాం

సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయ ఆవరణలో గల కారుకు నిప్పంటించారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలొ గన్నవరం సీఐ తలకు గాయాలయ్యాయి. టీడీపీ నేత చిన్నా కారుకు కూడా వంశీ వర్గీయులు నిప్పంటించారు. ఈ దాడులను నిరసిస్తూ విజయవాడ- హైద్రాబాద్ జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. ఈ రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో కు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు.