వైసీపీపై పరిటాల శ్రీరామ్ పరోక్ష విమర్శలు


అనంతపురం: జిల్లాలోని కనగానపల్లి మండలం కేఎస్‌పాళ్యంలో ఓ అమ్మాయి మృతి ఘటనను తనపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ చెప్పారు. ఆ యువతి పెళ్ళికి తమ ఇంటి నుండే తాళిబొట్టు, చీర పంపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శుక్రవారం సాయంత్రం పరిటాల శ్రీరామ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఆరు మాసాలుగా జిల్లాతో పాటు రాప్తాడు నియోజకవర్గంలో చోటు చేసుకొన్న చిన్న సమస్యలను తనకు అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఓ పత్రిక తనపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. 

కిడ్నాప్‌లు, దందాలు చేసే సంస్కృతి తమది కాదన్నారు. గ్రామాల్లో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలను కూడ భూతద్దంలో చూపిస్తున్నారని ఆయన చెప్పారు. 
కనగానపల్లి మండలం కేఎన్‌ పాళ్యంలో ఓ అమ్మాయి మృతి ఘటనను తనపై నెట్టడానికి నానా హంగామా చేశారన్నారు. కందుకూరు గ్రామంలో ఇటీవల జరిగిన గొడవ కారణంగా ఓ హత్య జరిగిందన్నారు. అది కూడా తనపై రుద్దేందుకు ప్రయత్నించారన్నారు. 


తప్పుడు ప్రచారంతో తనపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పరిటాల శ్రీరామ్ ను బూచిగా చూపిన ఎన్నికల్లో లబ్దిపొందే ఉద్దేశ్యంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. 

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాననే సంకేతాలు రావడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పరిటాల శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.పథకం ప్రకారంగానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. తమ కుటుంబానికి అత్యంత విశ్వాసంగా ఉండే చమన్ చనిపోతే కూడ తప్పుడు కథనాలు ప్రచురించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.