అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను విశాఖజిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు ఖండించారు. 

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను విశాఖజిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు ఖండించారు. కిడారి, సోమలను మావోయిస్టులు హత్య చేశారన్న బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదని అలాంటి తరుణంలో హత్యల్లో తన ప్రమేయం ఉందని ప్రకటనలు వెలువడటం మానసిక క్షోభకు గురవుతున్నానని తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కిడారి, సోమల హత్యలకు సంబంధించి ఆధారాలు ఉంటే బయటపెట్టాలని అంతేకానీ తనను మానసిక క్షోభకు గురిచేయోద్దని కోరారు. గిరిజనులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. హత్యలతో సంబంధం ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే తనకు తాను శిక్షించుకుంటానని అన్నారు. 

సుబ్బారావుతో పార్టీ పరంగా సంబంధమే తప్ప వ్యక్తిగత సంబంధం లేదన్నారు. అరకు ఎంపీపీ ఎన్నికల విషయంలో నెలకొన్న విబేధాలను పార్టీ అదిష్ఠానానికి తేలియజేశానని..అప్పటి నుంచి విబేధాలు సద్దుమణిగాయని తెలిపారు. 

నక్సల్‌ హత్యపై రాజకీయ హస్తం ఉందని చెప్పడం మంచి పద్దతి కాదని ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పాంగి రాజారావు తెలిపారు. కిడారి, సోమలతో రాజకీయపరంగా కొన్ని విషయాల్లో విబేధించానే తప్పా వ్యక్తి గతంగా ఏనాడు విబేధించలేదన్నారు. అలాగే వారు కూడా ఏనాడు తనని విబేధించలేదన్నారు. లేనిపోని అరోపణలు చేయడం తనని, తన కుటుంబాన్నితీవ్ర క్షోభకు గురిచేయడమేనన్నారు. తన హస్తం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే అని తెలిపారు.