ప్రశ్నిస్తే జేసీబీతో తొక్కించేస్తారా ... వైసీపీ రాక్షస పాలనకు పరాకాష్ట : జగన్పై నారా లోకేశ్ ఆగ్రహం
విశాఖ జిల్లాకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు జేసీబీ కింద నలిగి చనిపోయిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక ధ్వంసంతో ఆరంభమైన జగన్ రెడ్డి జేసీబీ పాలన క్రమంగా విపక్ష నేతల ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్. ప్రజావేదిక ధ్వంసంతో ఆరంభమైన జగన్ రెడ్డి జేసీబీ పాలన క్రమంగా విపక్ష నేతల ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజల్ని కూడా జగన్ పాలన బలిగొంటోందని నారా లోకేశ్ దుయ్యబట్టారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలిని జగన్ ప్రభుత్వం జేసీబీతో తొక్కించి చంపడం రాక్షస పాలనకు పరాకాష్ట అన్నారు. వృద్ధురాలిని చంపిన అధికారులను, దీని వెనుక వున్న వైసీపీ నేతల్ని తక్షణం అరెస్ట్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో వుంటున్న నిరుపేదలకు తక్షణమే పట్టాలివ్వాలని ఆయన కోరారు.
ఇకపోతే.. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తాజా చిత్రంపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాలయ్య సినిమాలు అగ్రవర్ణాలకు సింబాలిక్గా వున్నాయంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. దీనిపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ట్వీట్ను ఫేక్ పోస్ట్గా ప్రకటించారు . అంతటితో ఆగకుండా ఇలాంటి వ్యవహారశైలి వైసీపీదేనని ఆరోపించారు. ఇదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ , ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్లపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘ ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి ’’. ‘‘ ఫేక్ అకౌంట్స్, ఫేక్ ట్వీట్స్ నీకు ఆత్మసంతృప్తిని ఇస్తాయేమో కానీ నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్ రెడ్డి’’... అంటూ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.