వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సాక్షుల్ని సీబీఐ కాపాడాలని డిమాండ్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రిటాల హత్యకేసు మాదిరిగానే వివేకా హత్యకేసు నిందితులు కూడా అనుమానాస్పద మృతి చెందుతున్నారని ఆయన ఆరోపించారు.  

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (ys vivekananda reddy) హత్యకేసులో సాక్షిగా వున్న గంగాధరరెడ్డి మృతిపై టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ (nara lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. గంగాధరరెడ్డి అనుమానాస్పద మృతి నుంచి దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు జూమ్‌లో చొరబడ్డారని ఆయన ఆరోపించారు. జగనాసుర రక్తచరిత్ర-2 మొదలైందని దుయ్యబట్టారు. పరిటాల హత్యకేసు మాదిరిగానే వివేకా హత్యకేసు నిందితులు కూడా అనుమానాస్పద మృతి చెందుతున్నారని లోకేష్ ఆరోపించారు. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వివేకా హత్యకేసులో అనుమానితులైన ముగ్గురి మరణం వెనుక మిస్టరీ ఛేదించాలని లోకేష్ కోరారు. వివేకా హత్యకేసులో మిగిలిన నిందితులు, అప్రూవర్ల ప్రాణాలకు సీబీఐ రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివేకా హత్య జరిగి ఇప్పటికే మూడేళ్లు అయిపోయిందన్న లోకేశ్‌.. గొడ్డలి వేటు వేసిన వారు ఇప్పటి వరకూ చట్టానికి దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డెడ్‌బాడీకి కుట్లేసిన అనుమానితులు ముగ్గురూ అనుమానాస్పదంగా మృతి చెందటం వెనుక చాలా పెద్ద మిస్టరీయే ఉందని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్యకేసులో (paritala ravi) నిందితులూ ఇలాగే అనుమానాస్పదంగా చనిపోవడం.. రెండు హత్యల వెనుకా ఒకటే మాస్టర్‌ మైండ్‌ ఉండొచ్చంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో మొద్దు శీనుని చంపినట్టే, ఇప్పుడూ ఒక్కో నిందితుడినీ చంపుతున్నారని లోకేష్ ఆరోపించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి, వాచ్‌మెన్‌ రంగయ్యల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ వారిద్దరినీ ఢిల్లీలో సురక్షితంగా ఉంచకపోతే మరిన్ని అనుమానాస్పద మరణాలు ఖాయమని లోకేష్ హెచ్చరించారు.

ALso Read:వైఎస్ వివేకా హత్య కేసు సాక్షి గంగాధర్ రెడ్డి హఠాన్మరణం

కాగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు Gangadhar Reddy అనుమానిస్పద స్థితిలో మృతి చెందాడు. YS Vivekananda Reddy murder కేసులో తనపై CBI అధికారులు ఒత్తిడి చేశారని గంగాధర్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాదు తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా చెప్పారు. ఈ విషయమై Anantapur ఎస్పీకి కూడా పిర్యాదు చేశారు. యాడికిలోని తన నివాసంలోనే గంగాధర్ రెడ్డి మరణించడం కలకలం రేపుతుంది. .

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ప్రాణహాని ఉందని గంగాధర్ రెడ్డి గతంలోనే పోలీసులకు పిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి అనుచరులతో పాటు సీబీఐ నుండి తనకు ప్రాణహాని ఉందని 2021 నవంబర్ 29న అనంతపురం ఎస్పీ Pakirappa కు ఫిర్యాదు చేశాడు. తనకు సీబీఐ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని కూడా ఆ ఫిర్యాదులో గంగాధర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ YS Avinash Reddy ప్రమేయం ఉందని చెప్పాలని తనపై సీబీఐ అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తానే వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆ సమయంలో ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఆయన అప్పట్లోనే స్పష్టం చేశారు. ఈ విషయమై అప్పటి అనంతపురం ఎస్పీ ఫకీరప్ఫ స్పందించారు. గంగాధర్ రెడ్డి పిర్యాదు ఆధారంగా రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఈ విషయమై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామని కూడా ఎస్పీ ఫకీరప్ఫ అప్పట్లోనే మీడియాకు చెప్పారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను బెదిరింపులకు గురి చేస్తున్నారనే అంశంతో పాటు గంగాధర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశంపై విచారణ చేస్తామని ఎస్పీ వివరించారు.