వైసీపీ పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ అటికెలగుండు బాబిరెడ్డి వృద్ధ దంపతుల ఆస్తిని కబ్జా చేశాడని, అతనిపై తక్షణం కేసు నమోదు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ డిమాండ్ చేశారు. 

ఏపీలో వైసీపీ నేత‌లపై (ysrcp) ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ (nara lokesh). రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కబ్జాలు చేస్తున్నారని.. అందుకు క‌ర్నూలు జిల్లాలో ఓ ఘ‌ట‌న నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌న్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. 

ఆయన ఏమన్నారంటే.. ‘‘ వివాదంలో ఉన్న త‌మ కుటుంబ ఆస్తిని క‌బ్జాచేసిన‌ (pattikonda mla sridevi) పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి బినామీ అటికెలగుండు బాబిరెడ్డి, త‌మ‌ను చంపుతామంటూ బెదిరిస్తున్నార‌ని మురళీమోహన్‌గౌడ్‌- జయదేవి దంప‌తులు కర్నూలు కలెక్టరేట్‌ వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర నిరసనకి దిగ‌డం.. వైసీపీ భూక‌బ్జాల దందా రాష్ట్రంలో ఏ రేంజులో సాగుతోందో స్ప‌ష్టం చేస్తోంది. 

పత్తికొండలోని సర్వే నంబరు 115, 116, 117లో 8.25 ఎకరాల భూవివాదం కోర్టులో వుండ‌గా వైసీపీ ఎమ్మెల్యే బినామీ బాబిరెడ్డి త‌న‌పేరుతో భూమి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌డం ఓ త‌ప్ప‌యితే.. అందులో నిర్మాణాల‌కి దౌర్జ‌న్యంగా దిగ‌డం దారుణం. నిల‌దీసిన వృద్ధుల్ని చంపుతామ‌ని బెదిరించ‌డం వైసీపీ క‌బ్జాకోరుల అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట‌. వృద్ధుల‌కి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాలి. కోర్టు వివాదంలో వున్న భూమిని క‌బ్జాచేసిన బాబిరెడ్డిపై కేసు నమోదు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాను’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. 


Scroll to load tweet…