యువతకు స్పూర్తి: నాయిని మృతిపట్ల నారా లోకేశ్ సంతాపం
తెలంగాణ మాజీ హోంమంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
తెలంగాణ మాజీ హోంమంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘ప్రజల కోసం, కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొని యువనాయకుల్లో స్ఫూర్తిని నింపిన మాజీ మంత్రి, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిగారి మరణం విచారకరం. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని తెలుగువారు కోల్పోయారు. నర్సింహారెడ్డిగారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాయిని నర్సింహారెడ్డి బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు జూబ్లీహిల్స్లోని అపోలో అసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
సెప్టెంబరు 28న కరోనా బారిన పడిన ఆయన బంజారాహిల్స్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయినా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది.
శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఒక్కసారిగా పడిపోయింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు న్యుమోనియా సోకినట్లు తేల్చారు. మెరుగైన వైద్యం కోసం ఈ నెల 13న ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్చారు.
అప్పటినుంచి వెంటిలేటర్పై చికిత్స అందించారు. బుధవారం ఆయన పరిస్థితి విషమించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి, నాయిని అల్లుడు శ్రీనివాస్రెడ్డిని ఓదార్చారు.