జగన్ గారు.. మహిళల కంటే ఢర్టీ ఎంపీ ఎక్కువయ్యాడా : గోరంట్ల వ్యవహారంపై నాగుల్ మీరా ఆగ్రహం
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహరంపై టీడీపీ నేత నాగుల్ మీరా స్పందించారు. కోట్లాదిమంది మహిళలకంటే ఢర్టీ ఎంపీనే జగన్ రెడ్డికి ఎక్కువయ్యాడా అని నాగుల్ మీరా ప్రశ్నించారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహరంపై టీడీపీ నేత నాగుల్ మీరా స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. థర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ని జగన్ రెడ్డి ఎందుకు రక్షిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది మహిళలకంటే ఢర్టీ ఎంపీనే జగన్ రెడ్డికి ఎక్కువయ్యాడా అని నాగుల్ మీరా ప్రశ్నించారు. తన నేరాలను సమర్థించుకునేందుకు జగన్ రెడ్డి ఓ గ్యాంగ్ తయారుచేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కిరాతకులు, మాఫియాలు చెలరేగడానికి జగన్ రెడ్డి వైఖరే కారణమని నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోరంట్ల గలీజు వ్యవహారంపై నేషనల్ వుమెన్ కమిషన్ , పంజాబ్ ఎంపీ స్పందించినా జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నేరస్థులను కాపాడేందుకు కులచిచ్చు రెచ్చగొట్టే దుర్మార్గానికి దిగజారడం క్షమించరాని నేరమని నాగుల్ మీరా పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని నిలబెట్టాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే ఇప్పటికైనా గోరంట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్ ను తక్షణమే వైసీపీ నుంచి బర్తరఫ్ చేసి కేసు నమోదు చేయాలన్నారు. ఢర్టీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాయాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు.
ALso Read:మాధవ్ వీడియోని ఆ ల్యాబ్లో టెస్ట్ చేయండి.. జాతీయ మహిళా కమీషన్కు వంగలపూడి అనిత లేఖ
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla madhav) వీడియో వ్యవహారంపై జాతీయ మహిళా కమీషన్కు లేఖ రాశారు టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత. వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై, ఆయనకు సహకరిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనిత లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలు అభద్రతా భావంలోకి నెట్టబడ్డారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్, 2019 నుంచి నేటి వరకు దాదాపు 777 నేరాలు-ఘోరాలు మహిళలపై జరిగాయని.. మహిళలపై నేరాలు 2020లో 14,603 ఉంటే 2021లో 17,736కి పెరిగాయని ఆమె తెలిపారు. అంటే 21.45% పెరిగిపోయాయని అనిత ఎద్దేవా చేశారు. మహిళలపై దాడులు చూస్తుంటే నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. అయినా దిశ చట్టం పేరుతో మహిళలను, సభ్య సమాజాన్ని మభ్యపెట్టేలా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంలో దిశ చట్టమే లేదని.. మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందన్నారు.
వైసీపీ నాయకులే స్వయంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, బెదిరింపులకు దిగారని అనిత ఆరోపించారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనైతిక కార్యకలాపాల వీడియోనే ఇందుకు నిదర్శనమన్నారు. సేవ చేసేందుకు ప్రజలు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే వైసీపీ నాయకులు మాత్రం అనైతికమైన జుగుప్సకరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సరైన విచారణ గానీ, ఫోరెన్సిక్ టెస్ట్ గానీ చేయకుండా ఎంపీకి క్లీన్ చిట్ ఇచ్చారని అనిత ఆరోపించారు.