ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒక టెక్నికల్ క్రిమినల్ అన్నారు టీడీపీ నేత కూన రవికుమార్.  శవ రాజకీయాలు చేయడంలో జగన్ దిట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని సీఎంలు, గవర్నర్‌లు, మంత్రులందరి ఆస్తులన్నీ కలిపి జగన్ ఆస్తిలో మూడవ వంతు వుండదన్నారు రవి. 

మంత్రి సిదిరి అప్పలరాజుపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత కూన రవికుమార్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనింగ్, ఇసుక దోపిడీలు మితిమీరిపోయాయని ఆరోపించారు. సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మైనింగ్ దోపిడీ, స్పీకర్ తమ్మినేని, మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ జరుగుతోందని కూన రవికుమార్ ఆరోపించారు. రావణాసురుడికి పది తలల్లో వున్న అహంకారం .. జగన్‌కు ఒక్క తలలోనే వుందని ఆయన దుయ్యబట్టారు. జగన్ తన చేతికి మట్టి అంటకుండా.. తన చుట్టూ వున్న వారితో చేయిస్తున్నారని కూన రవి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జగన్ ఒక టెక్నికల్ క్రిమినల్ అని.. శవ రాజకీయాలు చేయడంలో దిట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని కూన రవికుమార్ ఆరోపించారు. వైసీపీకి చెందిన నేతలపై నాలుగు వందలకు పైగా క్రిమినల్ కేసులు వున్నాయని ఆయన అన్నారు. దేశంలోనే రిచెస్ట్ సీఎం అయ్యుండి.. జగన్ తాను నిరుపేదను అంటాడు అంటూ కూన రవికుమార్ దుయ్యబట్టారు. దేశంలోని సీఎంలు, గవర్నర్‌లు, మంత్రులందరి ఆస్తులన్నీ కలిపి జగన్ ఆస్తిలో మూడవ వంతు వుండదన్నారు. 

Also REad: వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకతాటిపైకి రావాలి: నాదెండ్ల మనోహర్

ఇకపోతే.. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా నిన్న ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. జగన్ తన చేతికి మట్టి అంటకుండా జగన్ క్రిమినల్ పనులు చేస్తారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసే అందుకు ఉదాహరణ అని అన్నారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని.. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసి, అధికారంలోకి రాగానే అక్కర్లేదన్నారని నిమ్మల దుయ్యబట్టారు. అవినాష్ రెడ్డిని రక్షించాలనే ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని రామానాయుడు ఆరోపించారు. 

చివరికి వివేకా వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా ఆరోపణలు చేస్తున్నారని.. నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో రూ.92 వేల కోట్లకు పైగా మద్యం విక్రయాలు అధికారికంగా జరిగితే.. అనధికారికంగా రూ.1.22 లక్షల కోట్లు జరిగాయని నిమ్మల అన్నారు. ఈ క్రమంలో రూ.11 వేల కోట్ల కమీషన్లను జగన్ అందుకున్నారని రామానాయుడు ఆరోపించారు. కలెక్టరేట్లు, భూములను తాకట్టు పెట్టారని.. ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో పేదలకు జరిగిన లాభం కంటే , వైసీపీ నేతలకే ఎక్కువ జరిగిందన్నారు.