ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిపై కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆముదాలవలస నడిరోడ్డుపై బట్టలూడదీసి పరుగెత్తిస్తానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆముదాలవలస నడిరోడ్డుపై బట్టలూడదీసి పరుగెత్తిస్తానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తమ్మినేని ఇంట్లో ఓ ఊర కుక్క అనవసరంగా మొరుగుతోందని ఆయన విమర్శించారు. ఆ ఊరకుక్క మాటలు విని పోలీసులు తప్పుదోవపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
సీతారాం అరాచకాలను అడ్డుకోవడానికే స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిందని ఆయన చెప్పారు.తండ్రీ కొడుకుల దురాగతాలను తుదముట్టించడమే తన లక్ష్యంగా ఆయన ప్రకటించారు.తనపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు.
ఏంపీటీసీ ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న గొడవ సందర్భంగా నమోదైన కేసులో ఇవాళే ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. గతంలో కూడ ఉద్యోగులను దూషించారనే కేసులో రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని రవికుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే.