దాడికి ప్రతిదాడి తప్పదని హెచ్చరించారు మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి. గత నెలలో మాచర్ల చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న బ్రహ్మారెడ్డి సహా పలువురు టీడీపీ నేతలు ఆదివారం పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టేందుకు వచ్చారు.
పోలీసులకు వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారని అన్నారు పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి. గత నెలలో మాచర్ల చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న బ్రహ్మారెడ్డి సహా పలువురు టీడీపీ నేతలు ఆదివారం పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టేందుకు వచ్చారు. అనంతరం బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాచర్లలో ప్రశాంత వాతావరణం వుండేలా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులేదనని అన్నారు . తాము శాంతియుతంగా వుంటామని, దాడికి ప్రతి దాడి తప్పదని బ్రహ్మారెడ్డి హెచ్చరించారు.
ఇకపోతే.. డిసెంబర్ 16వ తేదీన టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మాచర్లలో ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదేం ఖర్మ అనే కార్యక్రమం సందకర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.తమ పార్టీ కార్యాలయం,తమ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మరో వైపు టీడీపీ నేతలు తమపై దాడికి పాల్పడినట్టుగా వైసీపీ నేతలు ఆరోపించారు. జూలకంటి బ్రహ్మరెడ్డిని మాచర్ల అసెంబ్లీ ఇంచార్జీగా చంద్రబాబు నియిమించిన తర్వాత గొడవలు ప్రారంభమైనట్టుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అల్లర్లకు సంబంధించి టీడీపీ, వైసీపీలకు చెందిన నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read: మాచర్ల ఘర్షణ.. ఏ7 మినహా మిగిలిన టీడీపీ నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్..
మరోవైపు.. ఈ ఘటనలకు సంబంధించి టీడీపీ నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు జూలకంటి బ్రహ్మారెడ్డి సహా పలువురు టీడీపీ నేతలకు ఈ నెల 3న ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ఈ కేసులో ఏ 7గా ఉన్న కళ్లెం రమణారెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. మరో వైపు మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు. 144 సెక్షన్ కేవలం తమకే వర్తిస్తుందా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వైసీపీకి 144 సెక్షన్ వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు.
