ఏపీ మున్సిపల్ ఎన్కికల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన సత్తా చాటారు. ఏపీలో టీడీపీ ఘోర పరాజయాలను మూటగట్టుకున్న స్థితిలో కూడా తాడిపత్రిలో మాత్రం మెజారిటీ వార్డులను గెలుచుకుంది.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీచిన పరిస్థితిలో తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జెసీ ప్రభాకర్ రెడ్డి తన సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ఈ స్థితిలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పోరాడి విజయం సాధించారు.
తాడిపత్రిలో అత్యధిక స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ స్థితిలో తాడిపత్రి కౌన్సిలర్లను జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు పవన్ రెడ్డి హైదరాబాదుకు తరలించారు. వైసీపీ ప్రలోభపెడుతుందనే అనుమానంతో వారిని రహస్య ప్రదేశానికి తరలించారు. టీడీపీ కౌన్సిలర్లను వెంట పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి, పవన్ రెడ్డి హైదరాబాదుకు వెళ్లారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వాటిలో టీడీపీ 18 వార్డులను టీడీపీ గెలుచుకుంది. వైసీపీ 16 స్థానాలను దక్కించుకుంది. సీపిఐ ఒక వార్డును గెలుచుకోగా, మరో వార్డులు ఇండిపెండెంట్ విజయం సాధించారు.
కౌన్సిలరుగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా విజయం సాధించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై పోలీసులు పెడుతున్న కేసుల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ కసితో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపి విజయం సాధించారు.
