తాడిపత్రిలో హీటెక్కిన మున్సిపల్ వేడి:టీడీపీ అభ్యర్ధులతో జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్ధులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ వెళ్లారు.
తాడిపత్రి: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్ధులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ వెళ్లారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. ఈ వార్డుల్లో టీడీపీకి 18 స్థానాలు దక్కాయి. ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. వైసీపీ 16 స్థానాల్లో విజయం సాధించింది.
సేవ్ తాడిపత్రి అనే నినాదానికి మెచ్చి ప్రజలు తాడిపత్రిలో టీడీపీ అభ్యర్ధులను గెలిపించారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి కూడ తమ పార్టీ వాడేనని టీడీపీ నేతలు చెబుతున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ కూటమిగా పోటీ చేశాయి.
తమ పార్టీ గుర్తుపై గెలిచిన 18 మందితో పాటు సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్ధితో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ వెళ్లారు. ఛైర్మెన్ ఎన్నికల రోజున తమ పార్టీ అభ్యర్ధులతో కలిసి ఆయన నేరుగా తాడిపత్రికి చేరుకోనున్నారు.
రాష్ట్రంలోని తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లో టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించింది. మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ, జనసేన కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.