మంత్రి నాని ఇంట్లోని మహిళలూ అర్థరాత్రి రోడ్లపై తిరిగే వారేనా?: దివ్యవాణి సంచలనం
భూములు కోల్పోయి, రాజధాని కోసం 268రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రాజధాని మహిళలను ఉద్దేశించి అర్థరాత్రి రోడ్లపై తిరిగేవాళ్లంటూ మంత్రి కొడాలి నాని అసభ్యంగా మాట్లాడటం సరికాదని టిడిపి నాయకురాలు దివ్యవాణి సూచించారు.
గుంటూరు: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చూస్తుంటే చాలా డిప్రెషన్, ఫ్రస్టేషన్ లో ఉన్నట్లుగా ఉందని... రాజధాని రైతులు ఆయనకు శవయాత్ర చేయడంతో దాన్ని చూసి తట్టుకోలేక మరలా చంద్రబాబుపై, రాజధాని మహిళలపై నోరు పారేసుకుంటున్నాడని టీడీపీ మహిళా నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి దెప్పిపొడిచారు. గురువారం ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
''భూములు కోల్పోయి, రాజధాని కోసం 268రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రాజధాని మహిళలను ఉద్దేశించి అర్థరాత్రి రోడ్లపై తిరిగేవాళ్లంటూ మంత్రి కొడాలి నాని అసభ్యంగా మాట్లాడటం సరికాదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లున్నారు, వారుకూడా అలానే రాత్రిళ్లు తిరుగుతారా అని ఎవరైనా అంటే నాని పరిస్థితేమిటి? నానివల్ల వైసీపీకి అపకీర్తి కలుగుతోందని, నిక్కర్లు వేసే వయసునుంచి చంద్రబాబుని చూస్తున్నానని చెబుతున్న నాని ప్యాంట్లు వేసే టైమ్ కి ఆయనిచ్చే టిక్కెట్ట్ కోసం ఎదరు చూశాడు'' అని ప్రశ్నించారు.
''న్యాయంగా, ధర్మంగా నిజాలు మాట్లాడేవారంతా కుక్కలు, పందులు అంటున్న నాని ఒక్కసారి తనపార్టీ ఎమ్మెల్యే రజనీ గతంలో జగన్ గురించి ఏమన్నదో వింటే మంచిది. రోజా టీడీపీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని పంచలూడదీసి కొడతానని చెప్పింది నిజం కాదా? వల్లభనేని వంశీ జగన్ భార్యను జైలుకీడుస్తానని చెప్పింది వాస్తవం కాదా? వైసీపీ నేతల తీరు చూస్తుంటే ప్రజలంతా మనం మనుషులకు ఓట్లేశామా....లేక కుక్కలకు వేశామా అని అనుకుంటున్నారు'' అంటూ మండిపడ్డారు.
''కొడాలి నాని, ఇతర వైసీపీ నేతలు చంద్రబాబుని దూషించినా, లేక ఆ పార్టీలోని వర్ల రామయ్య వంటి సీనియర్లను తిట్టినా వారు అన్నీ భరిస్తోంది ప్రజలకోసమేనని తెలుసుకోండి. మతిలేకుండా కొడాలి నానీలా ఏదిపడితే అది అనడం చేతగాదని మాత్రం అనుకోవద్దు. మూడు ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వతీరుకి నిరసనగా, ప్రజలే వైసీపీ ముఖంపై పేడనీళ్లు కొడుతున్నారు'' అన్నారు.
read more చంద్రబాబు వద్ద పిచ్చి కుక్కలు, ఊరకుక్కలుంటాయి: మంత్రి కొడాలి నాని
''చంద్రబాబు నాయుడు రాజధానిలో పేదలకు కట్టించిన 5వేల ఇళ్లను వారికి ఇవ్వకుండా కేవలం ప్రేమ ఉందని మాటలు చెబితే ఎవరు నమ్ముతారు? రైతులకు, పేదలకు మధ్య గొడవలు పెట్టడానికే వైసీపీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ కుట్రలు చేస్తోంది. ఆనాడు రైతులు 33వేల ఎకరాలిస్తే రాజధాని నిర్మాణానికి ఒప్పుకుంటామని చెప్పిన జగన్, ఇప్పుడెందుకు ప్రజల కనీళ్లను రక్తంలా మార్చి తాగుతున్నారు'' అని అడిగారు.
''చంద్రబాబుని లుచ్చా అంటున్న నాని ఆయనముందు ఒక బాతుబచ్చా అని తెలుసుకుంటే సంతోషిస్తాం. సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుగా రైతులిచ్చిన భూములను పేదలకు పంచుతామనడానికి కొడాలి నాని ఎవరు. కియా పరిశ్రమ తెచ్చింది చంద్రబాబైతే మేమే తెచ్చామని చెప్పుకోవడం ఏంటి? ప్రజలు ఏమీ అమాయకులు కారనే విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలి. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్ తాగి నాని నోటికి పనిచెబితే, మహిళలు ఆయన దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టక ఏం చేస్తారు? నాని లాంటి వాళ్లు చంద్రబాబుని దూషిస్తూ ఆకాశంపై ఉమ్మేస్తున్నారని, తిరిగి అది వారి ముఖంపైనే పడుతున్నా వారిలో మార్పురావడం లేదని'' అన్నారు.
''ఆడవాళ్లను పట్టుకొని నానీ మాట్లాడిన మాటలపై కోర్టులో పరువునష్టం కేసు వేస్తే ఆయన పరిస్థితి అంతే. జగన్ కోసం విజయమ్మ, షర్మిల బయటకు వచ్చినప్పుడు టీడీపీవాళ్లెవరూ నానీ మాదిరి దారుణంగా మాట్లాడలేదు. రామోజీరావు వంటి వారికి ఒకచరిత్ర ఉందని, అటువంటి వ్యక్తి గురించి నానీ మాట్లాడమేంటి? చంద్రబాబు తనకష్టంతో పైకి వచ్చారని, ఆయన అక్రమాస్తులు సంపాదించాడని పిచ్చికూతలు కూస్తున్న నానీలాంటి వారు, ఆయనపై ఆరోపణలుచేసిచేసి, చివరకు ఏం సాధించారు?'' అంటూ మండిపడ్డారు.
''వైఎస్. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు సాక్షిలో ఏం రాశారో, తర్వాత సిగ్గులేకుండా ఎలా తప్పుని సమర్థించుకున్నారో చూశాం. నానీ కూడా ఆడదానికే పుట్టాడని, ఆయన చుట్టూ ఉన్నవారంతా అర్థరాత్రి రోడ్లపై తిరిగేవారయితే రాజధాని మహిళలు కూడా ఆయనకు అలానే కనిపిస్తారు. ప్రజలంతా జగన్ పాలనతో విసిగిపోయారు. దున్నపోతుని ఎంతకొట్టినా, ఏం చేసినా పాలు ఇవ్వదు కదా అనే భావనలో ఉన్నారు. మాట్లాడితే చంద్రబాబుని దూషించే నానీకి ధైర్యముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రాజధాని మహిళల ముందుకెళ్ళాలని... అప్పుడు ఎవరు ఏం పీకుతారో తెలుస్తుంది?'' అని హెచ్చరించారు.
''టీడీపీ వాళ్లు పందులు, కుక్కలైతే టీడీపీలో ఉండి జగన్ ని దూషించి, నేడు వైసీపీలో చేరి చంద్రబాబుని తిడుతున్న వారు ఏజాతి కుక్కలో, ఎటువంటి పందులో చెప్పండి. చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మధ్య విబేధాలు సృష్టించి, వర్గాలవారీగా విభజించి కొట్లాడుకునేలా చేస్తోంది. రాజధాని సమస్య కేవలం ఆ ప్రాంత రైతులదే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు, వారి బిడ్డలు రైతులకు మద్ధతు ప్రకటించాలి. నానీ ఇప్పటికైనా తన డిప్రెషన్, ఫ్రస్టేషన్ తగ్గించుకోవాలంటే యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేస్తే మంచిది'' అని దివ్యవాణి సూచించారు.