టిడిపిలో కరోనా కలకలం... మాజీ మంత్రి దేవినేని ఉమకు కూడా పాజిటివ్
తెలుగుదేశం పార్టీలో కరోనా కలకలం రేగింది. ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ చంద్రబాబుతో సహా లోకేష్ కూడా కరోనాబారిన పడగా తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమకు కూడా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా (corona virus_ మహమ్మారి రోజురోజుకు ప్రమాదకర రీతిలో విజృంభిస్తోంది. కేవలం సామాన్య ప్రజలే కాదు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే టిడిపి చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu), నారా లోకేష్ (nara lokesh) కు కరోనా నిర్దారణ కాగా తాజాగా ఆ పార్టీ కీలక నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావు (devineni umamaheshwar rao) కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.
స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు మాజీ మంత్రి దేవినేని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే వున్నానని... వైద్యుల సూచన మేరకు హోంఐసోలేషన్ లోకి వెళుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా వుండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
''నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను'' అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేసారు.
ఇదిలావుంటే టిడిపి చీఫ్ చంద్రబాబు ఇంట్లో కరోనా కలవరం రేగింది. ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్ కు కూడా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో నారా కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని... టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు. దీంతో వెంటనే తాను హోం క్వారంటైన్లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, తనతో కాంటాక్టులోకి వచ్చిన వారూ వెంటనే కరోనా టెస్టు చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇక ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి (ugranarasimha reddy) కూడా కరోనా బారినపడ్డారు. ఇదే జిల్లాలోని గిద్దలూరు (giddaluru) ఎమ్మెల్యే అన్నా రాంబాబు (anna rambabu)కు కూడా కరోనా నిర్దారణ అయ్యింది.
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) నివాసంలోనూ కరోనా కలవరం రేగింది. మంత్రి భార్య శచీదేవి (sachi devi) కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేయించేకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే మిగతా కుటుంబసభ్యులెవ్వరికీ ఈ వైరస్ వ్యాపించపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముందుజాగ్రత్తలో భాగంగా కరోనా నిర్దారణ అయిన భార్యతో పాటు మంత్రి బాలినేని, ఇతర కుటుంబసభ్యులు హోంఐసోలేషన్ లోకి వెళ్లారు.
ఇదిలావుంటే ఇప్పటికే మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిప్థితి మెరుగ్గానే వుంది.
మరో మంత్రి అవంతి శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. స్వల్ఫ లక్షణాలుండటంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు. తనను కలిసిన వ్యక్తులు టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.మరో మంత్రి కొడాలి నాని కూడా కరోనాబారిన పడగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను క్వారంటైన్లో ఉంటున్నట్టు... కొన్నిరోజులు ఎవరికీ అందుబాటులో వుండబోనని తెలిపారు.