ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు... జాగ్రత్త జగన్ రెడ్డి: దేవినేని ఉమ హెచ్చరిక
తమ ఆవేదనను ఎమ్మెల్యేకు తెలియజేయాలని ప్రయత్నించిన గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జీ చేయడాన్ని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ఖండించారు.
విజయవాడ: ఇళ్లపట్టాల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కిన బొబ్బిలి నియోజకవర్గంలోని గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడును అడ్డుకున్నారు. పోలీసుల లాఠీచార్జీని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ఖండించారు. ఈ ఘటన వైసిపి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల తిరుగుబాటును తెలియజేస్తోందని ఉమ అన్నారు.
''ఇళ్ళపట్టాలు వైసీపీ నాయకులకేనా? అనర్హులకు ఇచ్చారని ప్రశ్నిస్తే బొబ్బిలిలో గ్రామస్తులపై లాఠీఛార్జ్ చేస్తారా? నందివాడ తమిరిశ, జి.కొండూరు మునగపాడులోనూ గందరగోళం. శంకుస్థాపనల వద్ద పరాభవం. మీ ఏకపక్ష నిర్ణయాలు, అరాచకాలపై ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు. మార్పు మొదలైంది... తెలుసుకోండి వైఎస్ జగన్'' అంటూ ట్విట్టర్ వేదికన హెచ్చరించారు దేవినేని ఉమ.
విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొండకెంగువలో ఇప్పటికే ఇళ్ల పట్టాలివ్వగా ఆదివారం శంకుస్థాపన కార్యక్రమానికొచ్చిన బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు విచ్చేశారు. దీంతో గతంలో ఇళ్లపట్టాలు రాకపపోవడంతో ఆగ్రహంతో వున్న గ్రామస్థులు ఆయనను అడ్డుకున్నారు. వాహనం ముందుకు కదలకుండా ఆందోళన చేపట్టారు. గ్రామంలో 50 ఇళ్ల పట్టాలు అనర్హులకే కట్టబెట్టారని ఆయనను నిలదీశారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు గ్రామస్తులపై లాఠీచార్జి చేసి ఎమ్మెల్యేను అక్కడినుండి పంపించారు.
read more ఆ చచ్చు సన్నాసులకు ఇదే నా సవాల్... ఆధారాలుంటే బయటపెట్టండి: టిడిపి పట్టాభిరాం సీరియస్
ఇదిలావుంటే జగనన్న ఇళ్లపై అధికార వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జగనన్న ఇళ్లలో మంచం వేసుకునేంత చోటు కూడా లేదని వ్యాఖ్యానించారు. ఆ ఇంట్లో కొత్త జంటలు కాపురమే చేసుకోలేరని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల పేరిట పథకాన్ని ప్రారంభించింది జగన్ సర్కార్. మొదటి దశలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది. మూడు విభాగాలుగా గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఆయా ఐచ్ఛికాల ఎంపికను లబ్ధిదారులకే వదిలేసింది.
తొలిదశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ పేరిట ప్రభుత్వం నిర్మిస్తుంది. సొంతగా కట్టుకునే ఇళ్లు కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. సొంత స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుంది. ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుంది. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకును ఏర్పాటు చేయనున్నారు.