పార్టీ మారితే.. జగన్ని కూడా తిడతాడు, కొడాలి నాని ఒక పిచ్చోడు : బుద్దా వెంకన్న
చంద్రబాబు మీద గుట్కా కొడాలి నాని అవాకులు చెవాకులు పేలుతున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రేపు వైసీపీ నుంచి మరొక పార్టీలోకి మారితే జగన్ను కూడా నాని తిడతారని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు.
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని ఎన్నికలకు ముందు అప్పుల్లో వున్నారని, ఇప్పుడు ఆయనకు వేల కోట్లు ఎలా సంపాదించారని వెంకన్న ప్రశ్నించారు. దోచుకోవడాలు, దాచుకోవడాలు కొడాలి నానికి.. జగన్కు అలవాటేనని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాదులు కదుపుతానని పలుగు పట్టుకుని వెళ్లిన కొడాలి నాని.. ఇప్పుడు వైఎస్సార్ను ధీరుడు, శూరుడు అని పొగుడుతున్నారని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు.
చంద్రబాబు మీద గుట్కా నాని అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనకు లేదని.. రేపు వైసీపీ నుంచి మరొక పార్టీలోకి మారితే జగన్ను కూడా నాని తిడతారని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. రెండు రాష్ట్రాల్లో కొడాలి నానిని పిచ్చోడిలా చూస్తున్నారని.. నాని, జగన్లు చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరని వెంకన్న పేర్కొన్నారు. కొడాలి నాని లాంటోళ్లు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారని బుద్ధా గుర్తించారు.
అంతకుముందు సినీనటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు ఫైరయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... బాలకృష్ణ కాలిగోటికి కూడా కొడాలి నాని సరిపోడని ఆయన అన్నారు. సిగ్గు, లజ్జ లేకుండా బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నారని రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో లక్ష్మీపార్వతి ఏం చేసిందో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు, టీడీపీ నేతలందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు.
నందమూరి హరికృష్ణ పేరు చెప్పుకుని.. కొడాలి నాని లక్షలు దోచుకున్నారని రావి ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత నానికి లేదని... ఎంపీ విజయసాయిరెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి వాటా వుందని రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. నాని పెట్టుబడులపై తన వద్ద ఆధారాలు వున్నాయని.. నానికి చరమగీతం పాడేందుకు గుడివాడ ప్రజలు సిద్ధంగా వున్నారని రావి వెంకటేశ్వరరావు జోస్యం చెప్పారు. నానిని నెహ్రూ సెంటర్లో పాతేస్తానని రావి హెచ్చరించారు.