Asianet News TeluguAsianet News Telugu

పప్పూయాదవ్, పూలన్ దేవిల్లా...జగన్ ఎప్పటికైనా చేరాల్సింది అక్కడికే: మాజీ మంత్రి బండారు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏతప్పూ చేయలేదని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని  టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు, 

tdp leader bandaru satyanarayana rao sensational comments on cm jagan
Author
Amaravathi, First Published Aug 20, 2020, 9:57 PM IST

గుంటూరు: కరోనా కారణంగా వందలమంది చనిపోతున్నా, ఆసుపత్రుల్లో సరైనవైద్యం అందక, ఉపాధి కోల్పోయి తిండిలేక అవస్థలు పడుతున్నా ముఖ్యమంత్రి మాత్రం తనకు నచ్చిన అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఇందుకు బుధవారం జరిగిన  కేబినెట్ సమావేశమే ఉదాహరణ అని మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గురువారం సత్యనారాయణమూర్తి  తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపులు, వేధింపులు, కార్పణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 'నేను ఉన్నాను... నేను విన్నాను' అన్నవ్యక్తి, ఇప్పుడు 'నేను తిన్నాను.. తింటున్నాను' అని ఎందుకు చెప్పడంలేదన్నారు. 

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏతప్పూ చేయలేదని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. ఆయన అవినీతికి పాల్పడ్డాడని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేవలం లేఖలు మాత్రమే ఉన్నాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ కూడా చెప్పాడని, ఇప్పుడు జగన్ తన బుర్ర ఎక్కడ పెట్టుకుంటాడో సమాధానం చెప్పాలన్నారు. తప్పు చేయని అచ్చెన్నాయుడిని కక్షతో, కుఠిల బుధ్దితో నిర్భంధించిన ప్రభుత్వం  కరోనాకు గురిచేసిందన్నారు. 

read more  రాయలసీమకు ఆ హక్కు కల్పించాలి...ఏ ప్రభుత్వమైనా: సోమిరెడ్డి డిమాండ్ (వీడియో)

తన ప్రభుత్వ అవినీతిని అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నాడన్న భయంతోనే ఆయన్ని తప్పుడుకేసులతో అరెస్ట్ చేశారన్నారు. సీబీఐ కోర్టు కొనసాగితే తాను ఎక్కడ విచారణకకు హాజరుకావాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ రాష్ట్రంలో కరోనాను వ్యాపింపచేస్తున్నాడన్నారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకుంటూ లక్షల కోట్ల అవినీతికి పాల్పడినవ్యక్తి తప్పుచేయకుండా నిజాయితీతో బతికే అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, జే.సీ.ప్రభాకర్ రెడ్డిలపై తప్పుడు కేసులుపెట్టించి అరెస్ట్ చేయించడం కక్షపూరిత ధోరణి కాదా? అని బండారు మండిపడ్డారు. 

ఇళ్లపట్టాల పేరుతో, భూసేకరణకు రూ.4వేలుకోట్లు కేటాయించిన జగన్ తన పార్టీవారికి దోచిపెట్టలేదా? అని బండారు ప్రశ్నించారు. ఇసుక పాలసీ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకున్నారని, అంతా మింగేశాక ఇప్పుడు ఉచితంగా ఇసుక ఇస్తామని చెబుతున్నారన్నారు. కేంద్రం కరోనా నిధుల కింద రూ.8వేలకోట్లు ఇస్తే వాటిని కూడా దారిమళ్లించి ఈ ప్రభుత్వం మింగేసిందన్నారు. 

ప్రతిపక్షనేత చంద్రబాబుతో మాట్లాడారన్న అక్కసుతో రమేశ్ ఆసుపత్రి ఎండీపై కక్షకట్టారన్నారు. స్వర్ణప్యాలెస్ దుర్ఘటనకు రమేశ్ బాబుని బాధ్యుడిని చేసిన ప్రభుత్వం అయోధ్య రామిరెడ్డికి చెందిన సెజ్ లో జరిగిన ప్రమాదానికి ఎవరిని బాధ్యులను చేసిందో సమాధానం చెప్పాలన్నారు. తనకు, తన కుటుంబానికి, తన బంధువులకు ఒక న్యాయం ఇతరులకు మరో న్యాయం ఎలా వర్తిస్తుందో జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. 

జగన్ ఎంతలా కుట్రపూరిత రాజకీయాలు, కక్షసాధింపులకు పాల్పడుతున్నా న్యాయదేవత ఉండబట్టే న్యాయం బతుకుతోందన్నారు. విశాఖను పెద్దనగరంగా మారుస్తానని బీరాలు పలుకుతున్న జగన్ వీఎంసీలో కాంట్రాక్టర్ల పెన్ డౌన్ పై ఏం సమాధానం చెబుతాడన్నారు. ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో పరిశ్రమల భూములను కొట్టేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మద్యంలో, ఇసుకలో, ఇళ్లస్థలాల్లో, మైనింగ్ లో దోచుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్ తానొక మంచి వ్యాపారిగా మిగిలాడు తప్ప ఎప్పటికీ పరిపాలనా దక్షుడు కాలేడన్నారు. 

ఎమ్మెల్యేలు, మంత్రలు మారువేషాల్లో మద్యం షాపులముందుంటే తాగుబోతులు ఎంతలా ప్రభుత్వాన్ని దూషిస్తున్నారో, తాగుడుకారణంగా తమ సంసారాలు గుల్లవుతున్నాయని ఆడవాళ్లు ఎంతలా రోదిస్తున్నారో తెలుస్తుందన్నారు. అమ్మఒడి పేరుతో రాష్ట్రంలోని తల్లులకు జగన్ ప్రభుత్వం వేదననే మిగిల్చిందన్నారు.రాష్ట్రంలో రోజుకు 10వేల కరోనా కేసులు నమోదవుతున్నా, జగన్ లో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. వైద్యులు, అధికారుల కులగోత్రాలు అడుగుతున్న జగన్ ముందు తనకులగోత్రాలేమిటో తెలుసుకుంటే మంచిదని బండారు ఎద్దేవాచేశారు. 

ఆవభూముల్లో రాజమండ్రి ఎంపీ వేలకోట్లు తిన్నా, కావలి ఎమ్మెల్యే వందలకోట్లు కాజేసినా జగన్ వారిపై ఏం చర్యలు తీసుకున్నాడన్నారు. అందరూ అధికారులు నీలం సాహ్ని, గౌతంసవాంగ్ లా ఉండరని, ఐఏఎస్ లు ఎలా ఉంటారో ఇంకో సంవత్సరం తర్వాత జగన్ కు తెలిసివస్తుందన్నారు. అధికార మైకంలో, డబ్బు అహంకారంతో ఉన్న జగన్ కు ఇప్పుడు వాస్తవాలు బోధపడవన్నారు. 

చంద్రబాబునాయుడు పరిపాలనా దక్షుడని, జగన్ ఎప్పటికైనా పూలన్ దేవి, పప్పూ యాదవ్ లా చేరాల్సినచోటుకే చేరతాడని, అవినీతిపరుల జాబితాలో ఆయన ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటాడన్నారు. అవినీతితో పాలనచేస్తూ, ప్రతిపక్షనేతలపై కక్షసాధింపులకు పాల్పడుతున్న జగన్, ఇప్పటికైనా తన ధోరణి మానుకొని రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాలని బండారు హితవుపలికారు. ప్రజల్లో ఉద్యమం వచ్చిన నాడు జగన్, ఆయన ప్రభుత్వం ఎక్కడుంటాయో చెప్పాల్సిన పనిలేదని బండారు సత్యనారాయణమూర్తి విరుచుకుపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios