టిడిపికి బిగ్ షాక్... వైసిపి గూటికి గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియావుద్దిన్
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియావుద్దిన్ టిడిపిని వీడి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల నుండి వరుస ఎదురుదెబ్బలను తింటున్న తెలుగుదేశం పార్టీలో మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దిన్ టిడిపిని వీడి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసారు జియావుద్దిన్. ఈ క్రమంలోనే ఆయనకు వైసిపి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు సీఎం జగన్.
జియావుద్దిన్ చేరిక కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో బాగా బలహీనపడ్డ టిడిపికి జియావుద్దీన్ పార్టీని వీడటం మరింత బలహీనపర్చింది.
read more సీఎం జగన్ ఆదేశిస్తే రాజీనామా చేస్తాం: రఘురామ కీలక ప్రకటన
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది టిడిపి నాయకులు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. కేవలం నాయకులే కాదు తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ఇలా గత రెండేళ్లుగా టిడిపి నుండి వైసిపిలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి.