విషాదం... గుండెపోటుతో టిడిపి మాజీ ఎమ్మెల్యే మృతి
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వి.టి. జనార్థన్ తట్రాజ్ (బాబ్బి) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.
విజయనగరం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వి.టి. జనార్థన్ తట్రాజ్ (బాబ్బి) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. విశాఖపట్నంలోని తన స్వగృహంలో ఉండగా వేకువ జామున గుండె పోటుకు గురయ్యారు. అయితే కుటుంబసభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే మృతితో ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా కురుపాం మండలం చినమేరంగి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. . మాజీ మంత్రి విజయరామరాజు మేనల్లుడయిన జనార్థన్ 2009-2014 లో కురుపాం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినా కుల వివాదం కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు.
జనార్థన్ అకాల మరణంపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఆయన మృతి టిడిపికి తీరనిలోటని... పార్టీకోసం ఆయనెంతో అంకితభావంతో పనిచేశారని లోకేష్ అన్నారు.