Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి ఉప ఎన్నిక.. వైసీపీకి బుద్దొచ్చేలా చేయాలి: శ్రేణులకు బాబు దిశానిర్దేశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుపతి ఉపఎన్నికల్లో బుద్ధి చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానిక నేతలతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

tdp chief n chandrababu naidu video conferencing with party leaders ksp
Author
Tirupati, First Published Jan 16, 2021, 10:09 PM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుపతి ఉపఎన్నికల్లో బుద్ధి చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానిక నేతలతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... వైసిపిని ఓడించడం ద్వారా చారిత్రాత్మకమైన తీర్పుకు తిరుపతి వేదిక కావాలన్నారు. దేశానికే ఒక సందేశాన్ని తిరుపతి ప్రజలు పంపాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇదే స్ఫూర్తితో జనవరి 21 నుంచి 10 రోజుల పాటు, 700 గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేయాలని ఆయన సూచించారు. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక పెరిగిన దాడులు, విధ్వంసాలు, పన్నుల భారాలు, చేసిన అప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

అదే సమయంలో టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. హార్డ్ వేర్ హబ్ గా, మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తిరుపతిని చేశామన్నారు.

చిత్తూరు జిల్లాలో రూ లక్ష కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి 95 వేల మందికి ఉపాధి కల్పించామని చంద్రబాబు చెప్పారు. తిరుపతి, శ్రీసిటి, కృష్ణపట్నంలను ట్రైసిటిగా అభివృద్ది చేస్తే.., వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేస్తోందని ప్రతిపక్షనేత ఆరోపించారు.

వైసిపి వచ్చాక ఒక్క కంపెనీ తేకపోగా ఉన్న అమర రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు రద్దు చేశారాని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడామని.. అన్నదానం, ప్రాణదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం తిరుమల తిరుపతి పవిత్రతకే కళంకం తెచ్చిందని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు సజ్జల స్క్రిప్ట్, జగన్ రెడ్డి డైరెక్షన్లో, డీజీపీ యాక్షన్ లో కొనసాగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారని.., ఈ దాడులకు రాజకీయాలకు సంబంధం లేదని ఉన్మాదుల పని, పిచ్చోళ్ల పనిగా భోగి రోజున డీజీపీనే చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడు డీజీపీ మళ్లీ కనుమ రోజున మాటమార్చి దీనిని ప్రతిపక్షాలకు అంటగడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ వాళ్లను అరెస్ట్ చేసినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు.

దేవాలయాలపై దాడులు చేసిన వైసిపి వాళ్లను కేసుల నుంచి తప్పించి.., దాడులను బయటపెట్టిన వాళ్లపై కేసులు పెడ్తారా..? అని ప్రశ్నించారు. రామతీర్ధం వెళ్లామని నాపై, అచ్చెన్నాయుడిపై, కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెడ్తారా..? మాకన్నా గంట ముందు వెళ్లి రెచ్చగొట్టిన విజయసాయి రెడ్డి, వైసిపి నాయకులపై కేసులు పెట్టరా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వం 0.25% అప్పుల కోసం రైతులు, పేదలపై రూ.70వేల కోట్ల పన్నులు వేశారని ప్రతిపక్షనేత ఆరోపించారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ ఎగ్గొట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రూ.లక్షా 30వేల కోట్ల అప్పులు చేసి పేదల పథకాల పేరుతో కుంభకోణాలు చేస్తున్నారని.. ఒక్క ఇళ్ల స్థలాల్లోనే రూ.6,500 కోట్ల కుంభకోణాలు చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మద్యం, సిమెంటు, ఇసుక రేట్లు పెంచేసి దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పేదలకు 10% మాత్రమే ఇచ్చి, 90% వైసిపి నాయకులే స్వాహా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios