Asianet News TeluguAsianet News Telugu

కరోనా నుండి బయటపడక ముందే...భారత్ కు పొంచివున్న మరో ఉపద్రవం: చంద్రబాబు హెచ్చరిక

భారత దేశానికి కరోనా వైరస్ తో పాటు మరో ఉపద్రవం కూడా పొంచివుందని కేంద్రానికి చంద్రబాబు హెచ్చరించారు. 

TDP Chief Chandrababu  writes open letter to foreign affairs ministry
Author
Amaravathi, First Published Apr 22, 2020, 7:22 PM IST

గుంటూరు: ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర సమయంలో దేశానికి మరో ఉపద్రవం వెంటాడుతోందని ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. విదేశాల నుండి స్వదేశానికి వచ్చేందుకు సిద్దంగా వున్న వలస కార్మికులకు దేశంలో సరయిన ఉపాధి కల్పించలేకపోతే దేశంలో మరో కొత్త సంక్షోభం ఏర్పడే ప్రమాదం వుందని తెలుపుతూ కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్ కు చంద్రబాబు లేఖ రాశారు. 

కేంద్ర మంత్రికి చంద్రబాబు రాసిన లేఖ యదావిధిగా...

సుబ్రమణ్యం జై శంకర్ గారికి,

కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి,

భారత ప్రభుత్వం,

న్యూఢిల్లీ.
సార్,

విషయం: కువైట్ లోని భారతీయులు-వర్క్ పర్మిట్ లు లేకపోవడం, ఎక్స్ పైర్ కావడం-కువైట్ ప్రభుత్వ క్షమాభిక్ష ప్రకటన-వారిని స్వదేశానికి రప్పించడం-ఆరోగ్య పరీక్షలు-పునరావాసం-కోవిడ్ 19-గల్ఫ్ దేశాలనుంచి క్షేమంగా భారత కార్మికులను స్వదేశానికి వెనక్కి పంపడం గురించి.

గల్ఫ్ దేశాలు, అందులోనూ ప్రత్యేకంగా కువైట్ దేశం సెమి స్కిల్డ్ మరియు అన్ స్కిల్డ్ వలస కార్మికుల ఉపాధికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉన్న విషయం మీకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ భయాందోళనల కారణంగా దేశాలన్నీ పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ఉద్యోగులు, ప్రత్యేకించి వలస కార్మికులు ఉద్యోగాలను కోల్పోయారు. అంతేకాకుండా ఆయా దేశాలు వలస కార్మికులను స్వదేశాలకు వెనక్కి పంపేందుకు సిద్దంగా ఉన్నాయి. భారతీయ కార్మికులను స్వదేశానికి వెనక్కి పంపే ప్రక్రియలో నిమగ్నమైన ఆయా దేశాలలో కువైట్ కూడా ఒకటి. అందులో భాగంగానే కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ వ్యవహారాల శాఖ తమదేశంలో వర్క్ పర్మిట్లు లేకుండా, ఎక్స్ పైర్ అయిన పర్మిట్లతో, వీసాలతో అక్కడే నివసిస్తున్న వారందరికీ ఉచిత విమాన టిక్కెట్లు సమకూర్చి స్వదేశాలకు వెళ్లేలా క్షమాభిక్ష ప్రకటించింది. దాదాపు 15వేల మంది భారతీయులు ఈ క్షమాభిక్ష వినియోగించుకోడానికి ముందుకు వచ్చారు. ఈ బహిష్కరణ శిబిరాలలో దాదాపు 3వేలమంది తెలుగువారు ఉండగా, మరో 2వేల మంది తెలుగువారు తాత్కాలిక పాస్ పోర్ట్ లకు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో కువైట్ నుంచి తరలివచ్చేవారి భద్రత మరియు జీవనోపాధి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. 

మొదటిగా, భారతదేశానికి రావాలని కోరుకునేవారంతా తప్పనిసరిగా కోవిడ్ వైరస్ ప్రభావానికి గురికానివారై ఉండాలి. రెండవది, వారు భారతదేశానికి రాగానే మళ్లీ పరీక్షించి, వారంతా కోవిడ్ సోకనివారిగా ధ్రువీకరించుకోవాలి. స్వదేశం చేరాక వాళ్లంతా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం వారికి సరైన రవాణా సదుపాయం కల్పించి స్వగృహాలకు చేరుకునేలా చూడాలి.  స్వదేశానికి వారి తిరిగిరాకలో కీలకాంశం ఉపాధి కాబట్టి వాళ్లందరికీ  జీవనోపాధి మరియు పునరావాసం కల్పించి వాళ్లు మళ్లీ తమకాళ్ల మీద తాము నిలబడేలా చేయాల్సివుంది. కాబట్టి వారికి కావాల్సిన నిత్యావసరాలు మరియు వైద్య సహాయం అందజేయాలి.  

మన దేశానికి తిరిగివచ్చిన వారికి స్థానికంగా జీవనోపాధి వెదుక్కోవడానికి కావాల్సిన నైపుణ్యాలలో శిక్షణ అందించాలి. ఇటీవల అనేకమంది ప్రవాస తెలుగువారితో నేను జరిపిన చర్చలలో, ఇతర గల్ఫ్ దేశాలు కూడా భారతీయ కార్మికులను అక్కడనుంచి స్వదేశానికి పంపే ఏర్పాట్లలో ఉన్నట్లుగా వెల్లడించారు.  వీళ్లందరూ సరైన ఉపాధి పొందలేకపోతే,  మన దేశంలో మరో కొత్త సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచివుంది. కాబట్టి రాబోయే ఈ ఉపద్రవాన్ని కూడా సమర్ధంగా ఎదుర్కొని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దమై ఉండాలి. ఈ నేపథ్యంలో కువైట్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చే వలస కార్మికుల భద్రత, జీవనోపాధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. తిరిగివచ్చే వారందరికీ కావాల్సిన ఆహారం, ఆశ్రయం, వైద్య సాయం, జీవనోపాధి అందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన మార్గదర్శకం చేయాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
 

ధన్యవాదములతో 
నారా చంద్రబాబు నాయుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios