ఫ్రంట్ లైన్ యోధురాలిపై వేధింపులు...: గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు
రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ను నిర్ధారించడానికి తప్పు చేసిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
అమరావతి: కరోనా మహమ్మారి ప్రజలందరినీ అనేక ఇబ్బందులకు... తీవ్రమైన ఒత్తిడికి గురిచేసిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి పరీక్షా సమయాల్లో పోలీసులు అర్ధంలేని వేధింపులు కట్టిపెట్టి స్నేహపూర్వకంగా వుండటం చాలా అవసరమన్నారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ను నిర్ధారించడానికి తప్పు చేసిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్ పై పోలీసు చేస్తున్న వేధింపులపై గవర్నర్ కు లేఖ రాశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఫ్రంట్లైన్ వారియర్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంవత్సర కాలంగా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారని అన్నారు. కానీ ఈ ఫ్రంట్ లైన్ యోధులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కరోనా ఇబ్బందులు, పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీత కన్నుతో వ్యవహరిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
read more పర్మిషన్ వున్నా ఫైన్ వేస్తారా.. విశాఖలో యువతి హల్చల్, అసలు కథ ఇదీ
''2020 మే నెలలో విశాఖపట్నంలో దివంగత దళిత డాక్టర్ సుధాకర్ అంశాన్ని ప్రజలు మరచిపోక ముందే విశాఖపట్నంలో మరో ఫ్రంట్ లైన్ యోధురాలిపై వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న దళిత యువతి లక్ష్మి అపర్ణ లాక్ డౌన్ సమయంలో విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆమె వద్ద అన్ని అనుమతి పత్రాలు వున్నా పోలీసులు రామా టాకీస్ సమీపంలో అడ్డగించి అనవసరమైన వేధింపులకు గురిచేశారు'' అని మండిపడ్డారు.
''వైసీపీ ప్రభుత్వంలో ఒక వర్గం పోలీసులు ప్రజాస్వామ్య ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. పర్యవసానంగా ఫ్రంట్లైన్ యోధులు, ప్రతిపక్ష నాయకులు, సామాన్య ప్రజానీకం, మరీ ముఖ్యంగా దళితులు వేధింపులకు గురవుతున్నారు. ఇంతవరకు అలాంటి పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు లాంటి సంఘటనలు వలసరాజ్యాల పాలనను గుర్తుకు తెస్తున్నాయి'' అని గవర్నర్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.