జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తిరిగి అరెస్ట్... జగన్ కు చంద్రబాబు హెచ్చరిక
విడుదలైన 24 గంటలలోపే టీడీపీ నేతలను మరలా అరెస్ట్ చేయడం వైకాపా కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి కుట్రా రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలే అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు బెయిల్ పై విడుదలయిన రోజే తిరిగి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.
''విడుదలైన 24 గంటలలోపే టీడీపీ నేతలను మరలా అరెస్ట్ చేయడం వైకాపా కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు యధేచ్ఛగా కోవిద్ నిబంధనలను ఉల్లంఘించినా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క కేసు నమోదు చేయలేదు. వందలాది మందితో బహిరంగ సమావేశాలు పెట్టిన విజయసాయిరెడ్డి లాంటి వారిని వదిలేసి జేసీ కుటుంబ సభ్యులపై మాత్రం తప్పుడు కేసులు బనాయిస్తున్నారు'' అని అన్నారు.
read more ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
''నియంతృత్వంతో ప్రజాభిమానం ఉన్న నాయకులను అడ్డుకోలేరు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు నానాటికి పరాకాష్టకు చేరుతున్నాయి. విధ్వంసం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా క్షేమం కోసం వినియోగించకుండా.. ప్రతిపక్ష నేతలను అణచివేయడానికి ఉపయోగిస్తున్నారు, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు'' అని మండిపడ్డారు.
''నియంతలు పాలకులైతే పరిపాలన ఇలాగే ఉంటుంది. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు విడనాడి తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి. లేనిపక్షాన వైసిపి నాయకుల రాక్షస సంస్కృతికి ప్రజలే భవిష్యత్తులో తగిన బుద్ది చెబుతారు'' అని చంద్రబాబు హెచ్చరించారు.