ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది, మానవత్వాన్ని మరచింది. మేత లేక పశువులు నకనకలాడుతున్నాయి. కూరగాయలు, బియ్యం లేక ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో ఉన్నారు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుంచి 7 రోజులు నిల్వ ఉండిపోయాయి. ఇళ్లలో బురద చేరిపోయింది. ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంటిలో వున్న అన్ని వస్తువులు పనికి రాకుండా పోయిన దృశ్యాలు నా పర్యటనలో చూశాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచిందని చంద్రబాబు మండిపడ్డారు. అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని కోరారు. స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు వరద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ కొంత మేరకు సాయం అందించిందని.. సాయం కొనసాగిస్తుందని చెప్పారు. 

తక్షణం పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా ఉందని.. దాతలు వారి పేరుతోగానీ, టీడీపీ ద్వారా గాని ఎండుగడ్డి వితరణ చేయవల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే కూరగాయలు, బియ్యం కూడా అందించవలసిందిగా దాతలను కోరుతున్నానని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఎండుగడ్డి, కూరగాయలు, బియ్యం వితరణ చేయవలసిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.