విశాఖ గ్యాస్ లీక్ పై చంద్రబాబు స్పందన...కోటి పరిహారం డిమాండ్ చేసిన రామకృష్ణ
విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజిపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజిపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరవాడలో రియాక్టర్ నుంచి బెంజీన్ లీకేజిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ లీకేజి మరువక ముందే పరవాడ గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధాకరమన్నారు. వరుస గ్యాస్ లీకేజిలతో విశాఖ ప్రజల్లో భయాందోళనలు కారణమవుతున్నాయని అన్నారు.
సాయినార్ ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని... లీకేజి బాధితులకు వెంటనే అత్యున్నత వైద్యసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇక ఈ గ్యాస్ లీక్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన, నంద్యాల ఎస్పీవై రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ విషవాయువు లీకేజీ ఘటనలు మరవకముందే మరో ఘటన విశాఖలో జరగటం దిగ్భ్రాంతిని కలిగించాయన్నారు. తాజా ఘటనలో ఇద్దరు మృతి చెందడం, మరో ఐదుగురు అస్వస్థతకు గురవడం విచారకరమన్నారు.
ఈ ఘటనలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం, ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ నిల్వలున్న పరిశ్రమలన్నింటిని తనిఖీ చేయాలని సూచించారు. పదే పదే విశాఖలో జరుగుతున్న విషవాయువుల లీకేజీ ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.