అచ్చెన్న, జెసి, యనమల, అయ్యన్న...వారి లిస్ట్ లో మొత్తం 33మంది: చంద్రబాబు
కరోనా కేసులు ప్రభలుతున్న వేళ వైసిపి ప్రభుత్వం స్కాంల కోసమే ఇళ్ల స్థలాల స్కీంపై శ్రద్ధ పెట్టిందని మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అమరావతి: కరోనా కేసులు ప్రభలుతున్న వేళ వైసిపి ప్రభుత్వం స్కాంల కోసమే ఇళ్ల స్థలాల స్కీంపై శ్రద్ధ పెట్టిందని మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో లేటరైట్, అరకు ఏజెన్సీలో గ్రానైట్ అక్రమ రవాణాలో వైకాపా నేతల హస్తమున్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు.
''108 అంబులెన్స్ ల విషయంలో భారీ కుంభకోణం జరిగింది. అలాగే సీఎం కుటుంబానికి చెందిన ఈడీ అటాచ్ మెంట్ లో ఉన్న సరస్వతి పవర్ కు వేల కోట్ల విలువైన గనులు కేటాయింపు అధికార దుర్వినియోగమని ప్రజలు భావిస్తున్నారు. వీటిని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై, ప్రత్యేకించి తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారు'' అని ఆరోపించారు.
''చట్టాన్ని, ప్రాథమిక హక్కులు కాపాడి ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వాటిని కాలరాస్తూ ఉద్దేశ్యపూర్వకంగా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్న నాయకులను టార్గెట్ చేయటం దుర్మార్గం'' అని అన్నారు.
''సర్జరీ చేయింకొని బెడ్ రెస్ట్ లో ఉన్న అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి వందల కి.మీ. ప్రయాణం చేయించి ఇబ్బందులకు గురి చేశారు. తద్వారా మళ్లీ రెండో సారి సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యత సీఎంది కాదా? పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసినా మీలో మార్పు రాదా?'' అని ప్రశ్నించారు.
read more ఆ లైన్ దాటితే ఎంతటి వారిపై అయినా చర్యలు తప్పవు: కృష్ణంరాజు వ్యవహారంపై మోపిదేవి
''108 కుంభకోణంపై పట్టాభి ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే కుంభకోణం మీద విచారించి చర్యలు తీసుకోకుండా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి బెదిరించే ప్రయత్నం చేశారు. అయ్యన్న పాత్రుడు గారి పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కూన రవికుమార్, వాసుపల్లి గణేష్ కుమార్, జేసీ బ్రదర్స్, కలమట మోహన్ రావు, బోండా ఉమా, కేఈ ప్రభాకర్, గల్లా జయదేవ్, పరిటాల శ్రీరామ్.. ఇలా 33 మందిపై అక్రమ కేసులు బనాయించారు'' అని తెలిపారు.
''అధికారపక్షం ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానా నిలబడి పోరాడుతుంది. చట్ట వ్యతిరేక, కక్ష పూరిత రాజకీయాలకు స్వస్థి చెప్పకపోతే ప్రజలు తగు సమయంలో తగు బుద్ది చెబుతారు'' అని జగన్ ను హెచ్చరించారు చంద్రబాబు.