అల్లూరి 125వ జయంతి ఉత్సావాలు జరుపుకోవడం దేశానికే గర్వకారణం: చంద్రబాబు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు పౌరుషానికి, తెలుగువారి ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా... ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన అల్లూరిని దేశం స్మరించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు.
కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని, అమాయక ప్రజల దోపిడీని ఎదిరించి చిన్నవయసులోనే ప్రాణాలను త్యాగమిచ్చారని గుర్తుచేశారు. అటువంటి అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుని ఆ మహానుభావుడికి నివాళులర్పించాల్సింగా తెలుగుప్రజలను, తెలుగుదేశం కార్యకర్తలను కోరుతున్నానని ట్వీట్టర్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సావాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమని చంద్రబాబు అన్నారు. చిన్న వయసులోనే అల్లూరి బ్రిటీష్ వారిని గడగడలాడించి.. గిరిజనులందరినీ సమీకరించి సాయుధ పోరాటంతో ముందుకు సాగరని కొనియాడారు. అల్లూరి పోరాటం తట్టుకోలేక బ్రిటిష్ వారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంతమొందించారని తెలిపారు. 27 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ వారు అంతమొందించినా.. ఆయన పోరాటం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయిందని చంద్రబాబు చెప్పారు.
పార్లమెంటులో కూడా అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కృషి మూలంగా నాటి వాజ్ పేయి ప్రభుత్వం అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వాలు మారడంతో అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ఇప్పటికైనా తెలుగువారి ఆకాంక్షను నెరవేర్చాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నట్టుగా చెప్పారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ తెలుగు వీరుని చరిత్రను స్మరించుకుంటూ వారి స్మృతికి నివాళులర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.