ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇంచాార్జి బిటెక్ రవి భద్రత తొలగించడంపై చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసాారు. 

అమరావతి : పులివెందుల అసెంబ్లీ టిడిపి ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి భద్రత తొలగించడంపై ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ ప్రత్యర్థుల నుండి రవికి ప్రాణహాని వుందని... గన్ మెన్ల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కోరుతూ చంద్రబాబు లేఖ రాసారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిందనే కారణంతో భద్రతను తొలగించడం సరికాదన్నారు. రాజకీయ ప్రత్యర్థులు, సంఘ వ్యతిరేక శక్తుల బెదిరింపుల నేపథ్యంలో రవికి భద్రత కొనసాగించాలని చంద్రబాబు కోరారు. 

2006లో రవి పెదనాన్న ఎం.రామచంద్రారెడ్డి, కజిన్ పి.రామచంద్రారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రవికి కూడా ప్రాణహాని పొంచివుండటంతో ఆనాటి ప్రభుత్వం 1+1 గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించింది. అంటే ఎమ్మెల్సీగా ఎన్నికవక ముందు నుండే రవికి సెక్యూరిటీ వుండేది. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బిటెక్ రవికి 2+2 భద్రత కల్పించారని అన్నారు. అయితే ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడాన్ని సాకుగా చూపి అతని భద్రతను తొలగించడం సరికాదన్నారు. 

బిటెక్ రవిని అంతమొందించాలని, సంబంధం లేని కేసుల్లో ఇరికించాలని రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో రవికి సంబంధాలున్నాయంటూ ప్రత్యర్థులు దుష్ఫ్రచారం చేయడమే కాదు నిందితుడిగా చేర్చాలని కుట్రలు కూడా పన్నారని చంద్రబాబు అన్నారు. ఇలా ప్రత్యర్థులు టార్గెట్ చేసిన రవిని కాపాడే బాధ్యత పోలీసులది... కాబట్టి భద్రత తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిజిపిని కోరారు చంద్రబాబు. 

Read More బిటెక్ రవికి షాక్: గన్ మెన్ల తొలగింపు

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున (మార్చి 13న) బిటెక్ రవి కాన్వాయ్‌పై గూండాలు దాడి చేసారని చంద్రబాబు గుర్తుచేసారు. ఈ దాడిలో కారు ధ్వంసమవగా రవి మాత్రం తృటిలో తప్పించుకున్నారని అన్నారు. ఇలా భౌతిక దాడులకు దిగుతూ రవి ప్రాణాలకు హాని కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి భద్రత కొనసాగించాలని కోరుతున్నామని చంద్రబాబు అన్నారు. 

కడప జిల్లాలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిటెక్ రవి భద్రతపై చాలా ఆందోళన చెందుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనకు ఏదైనా హాని జరిగితే పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బిటెక్ రవి ప్రాణాలకు రక్షణ కల్పించేలా తగు భద్రతా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని డిజిపికి రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.