ఎవరేం చేస్తున్నారో నివేదికలు, నిర్లక్ష్యాన్ని వీడాలి: పార్టీ నేతలపై బాబు ఆగ్రహం
పార్టీ నేతల తీరుపై బాబు ఆగ్రహం
అమరావతి: ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఎవరేం చేస్తున్నారో తన వద్ద నివేదికలు ఉన్నాయని బాబు చెప్పారు. నిర్లక్ష్యాన్ని తాను సహించేది లేదన్నారు.
మంగళవారం నాడు అమరావతిలో చంద్రబాబునాయుడు అధ్యక్షతన టిడిపి సమన్వయ కమిటి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై బాబు చర్చించారు.
ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఏడాది మే మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బాబు చెరప్పారు.ఒకవేళ ముందే జరిగే అవకాశం కూడ లేకపోలేదని బాబు పార్టీ నేతలకు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని బాబు పార్టీ నేతలకు సూచించారు.
పార్టీని బలోపేతం చేసే విషయమై కొందరు నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబునాయుడు పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ నేతలు కృషి చేయడం లేదన్నారు. ఎవరేవరు ఏం చేస్తున్నారో తన వద్ద నివేదికలు ఉన్నాయని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చెప్పారు.నిర్లక్ష్యాన్ని తాను సహించేది లేదని బాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.
ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ధర్మ పోరాట సభలను నిర్వహించాలని ఆ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. వచ్చే ధర్మపోరాట దీక్ష సభను రాజమండ్రిలో నిర్వహించాలనే చర్చ కూడ సమావేశంలో సాగింది.అయితే స్థానిక నేతలతో ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు బాబు చెప్పారు.
మరో వైపు కర్నూల్, అనంతపురం జిల్లాల్లో కూడ ధర్మపోరాట సభల నిర్వహణపై కూడ ఈ సమావేశంలో చర్చించారు.అయితే చివరి ధర్మపోరాట సభ గుంటూరు-విజయవాడలను కలిపి ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడ ఈ సమావేశంలో వచ్చింది.